Sep 23,2023 21:57

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
కెవిపిఎస్‌ బైక్‌ జాతా పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలకు తూట్లు పొడుస్తూ దళితులు ఎదుర్కొంటున్న అన్నిరకాల సమస్యల పరిష్కరించాలని ప్రధాన డిమాండ్‌తో దళితులను ఏకం చేయడంలో భాగంగా ఈనెల 24 నుండి 28వ తేదీ వరకు కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైక్‌ జాతాలను విజయవంతం చేయాలని కెవిపిఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు. 29 తేదీన విజయవాడలో జరిగే మహాధర్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నురి ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంటరానితనం నిర్మూలించాలని, 41 సిఆర్‌టిసి జస్టిస్‌ పున్నయ్య సిఫార్సులు అమలు చేయాలని, డప్పు కళాకారులకు చర్మకారులకు రూ.5000 పెన్షన్‌ మంజూరు చేయాలని, కాటి కాపులను గుర్తించి నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పౌర హక్కుల దినం పాటించాలని, దళితులపై దాడి చేసిన వారి ఆస్తుల జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు విడుదల చేయాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌లో నిధులు విడుదల చేయాలని, భూమిలేని నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంచాలన్నారు. దళితులను ఆర్థికంగా అభివద్ధి చేసే వివక్ష తగ్గుతుందని తెలిపారు. ఈనెల 29న విజయవాడలో జరిగే మహాధర్నా పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా 28వ తేదీని చిత్తూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాంచీపురం సురేంద్ర, కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు కన్నన్‌ , పాకాల సుబ్రహ్మణ్యం గోవిందుస్వామి పాల్గొన్నారు.