అనంతపురం కలెక్టరేట్ : శ్రీసత్యసాయి నీటిసఫరాలో పని చేస్తూ మరణించిన ఆరుగురు కార్మికుల కుటుంబాలకు 1.71 లక్షల చెక్కులను సోమవారం నాడు అనంతపురం కార్మిక శాఖ కార్యాలయంలో డిసిఎల్ జి.రఘురాములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ సత్యసాయి తాగునీటి సరఫరాలో పని చేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు గ్రాట్యుటీ 6 మందికి డిసిఎల్ పంపిణీ చేయడం కార్మికుల విజయం అన్నారు. కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో మూడు సమ్మెలు, 18 రోజుల కార్మికుల రిలే దీక్షలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో జరిగిన సంప్రదింపుల మేరకు మొదటి దిశగా ఆరుగురికి కార్మికులకు సాయం అందిందన్నారు. ఇంకా 51 మంది కార్మిక కుటుంబాలకు గ్రాట్యుటీ అందాల్సి ఉందని వారికి కూడా వెంటనే ప్రభుత్వం చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బోర్డ్ ఆఫీస్ టైమ్మ్ ఆఫీసర్ రాజు, సత్యసాయి తాగునీటి సరఫరా యూనియన్ నాయకులు తిప్పేస్వామి, రవిచారి, గోవిందు, రమేష్ రెడ్డి, సుంకన్న పాల్గొన్నారు.










