Jul 07,2023 21:59

'నీలకురింజి సముద్రం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు

           ప్రజాశక్తి-అనంతపురం   కళ్లముందున్న జీవన సత్యాన్ని తెలియ జేసేదే సాహిత్యమని విరసం నాయకులు తెలిపారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో సాహితీ స్రవంతి, ఆర్ట్స్‌ కళాశాల తెలుగు విభాగం సంయుక్తంగా కవి, విమర్శకు డు రాజారాం అధ్యక్షతన హిందూపురం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రగతి రచించిన 'నీలకురింజి సముద్రం' కవిత్వ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడు తూ తీవ్రమైన పని ఒత్తిడి, తీవ్రమైన సంక్షోభంలో నుంచే కవిత్వం పుడుతుందన్నారు. సమాజ ప్రగతి రథచోదకులు కవులను విద్యార్థుల మధ్య ఉంటూ సమాజాన్ని దర్శించి ప్రేమతత్వాన్ని అందించిన ప్రగతిని అభినందించారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.సీ.ఆర్‌.దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి ఉరుకులు, పరుగుల ఒత్తిడిమయమైన ఉద్యోగ జీవితంలో వృత్తిని, ప్రవృత్తిని ప్రగతి చాలా చక్కగా సమన్వయించుకుని రచనలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగారమోహన్‌ కవిత్వాన్ని బాగా అధ్యయనం చేస్తేనే నాణ్యమైన కవిత్వం వస్తుందన్నారు. రచయితలు ఎప్పుడూ సమాజంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉందని వివరించారు. ఆత్మీయ అతిథి కవి రాధేయ అమ్మను తలుచుకుంటే వెచ్చని బొగ్గులపొయ్యిలా హదయాన్ని తాకుతుందని చక్కని భావ ప్రతీకలు సుతారంగా రాసిన ప్రగతిని అభినందించారు. నీలకురింజి సముద్రం కవయిత్రి ప్రగతి తన స్పందన తెలియజేస్తూ పుస్తక ప్రచురణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రోత్సహించిన ఆత్మీయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరగా అంకె శ్రీనివాస్‌ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రచురణ కర్త, హైదరాబాదు ఛాయా రీసోర్స్‌ సెంటర్‌ బాధ్యులు అరుణాంక్‌ లత, డాక్టర్‌ హేమమాలి, కవయిత్రి శశికళ, సమీక్షకురాలు పేరిందేవి, సాహితీ స్రవంతి నాయకులు ప్రజ్ఞాసురేష్‌, హరి, అధ్యాపకులు లక్ష్మీనారాయణ, మాధవీలత, యోగేశ్వర్‌నాయుడు, అంకే మదన్మోహన్‌, రంగనాథ్‌, శివచంద్ర, ఉషారాణి, శైలజారాణి, అరుణశ్రీ, పల్లవి, పూల్‌ సింగ్‌, కిరణ్‌, రాజశేఖర్‌రెడ్డి, సాహితీవేత్తలు సడ్లపల్లి చిదంబరెడ్డి, తరిమెల అమర్నాథ్‌ రెడ్డి, డాక్టర్‌ శాంతి నారాయణ, బి.నారాయణ, అశ్వర్థరెడ్డి, విద్వాన్‌ దస్తగిరి, ఉప్పరపాటి వెంకటేశులు, రియాజుద్దీన్‌, నిర్మలా రాణి, రాఘవేంద్ర, మాడుగుల సులోచన, శోభామణి, బిజిలీ, నర్సిరెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌ బాషా, రెడ్స్‌ భానుజా, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, విశ్రాంత ప్రిన్సిపాళ్లు మురళీధర్‌రావు, పురుషోత్తమరెడ్డి, శశికళ, బిఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగిణి రమాదేవి, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.