- జగనన్న సురక్ష'తో ప్రజల ఇళ్ల వద్దకే సేవలు
- మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-ఉరవకొండ : రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పాలన దేశానికే ఆదర్శమని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ సచివాలయం-2 పరిధిలో జరిగిన 'జగనన్న సురక్ష' గ్రామసభకు విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న సురక్ష' కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీల సిఫార్సు ఉంటేనే ప్రజలకు సేవలు అందేవని కానీ జగనన్న పాలనలో ఇళ్లవద్దకే అన్ని రకాల సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని చెప్పారు. మండలంలో కొద్దిరోజుల్లోనే 5 వేల మందికి 11 రకాల ధ్రువీకరణ పత్రాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పలువురికి పలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప, సచివాలయ కన్వీనర్లు పద్మావతి, ఈడీగా ప్రసాద్, మద్దికెర అన్వర్, పార్టీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు బసవరాజు, జేసిఎస్ కన్వీనర్ ఆసిఫ్, ఎంపిడివో చంద్రమౌళి, ఎంఎల్ఓ ఓబులేసు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు, వలంటీర్లు, వైస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










