Nov 16,2023 00:22

మాట్లాడుతున్న మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి - పొన్నూరు రూరల్‌ : వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సిఎం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి భుజస్కందాలపైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా పొన్నూరులోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత మహించారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా సిఎం జగన్‌ పాలన అందించారని అన్నారు. గొర్రెలు, బర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారంటూ తనను టిడిపి వారు హేళన చేశారని, పాలను అమ్ముకొని రూ.కోట్లను వారు సంపాదించలేదా? అని ప్రశ్నించారు. నాయీబ్రాహ్మణులను చంద్రబాబు గెటవుట్‌ అన్నారని, జగన్‌ మాత్రం టిటిడిలో సభ్యులుగా చేర్చారని, మత్స్యకారులను తోలు తీస్తాం అని చంద్రబాబు అంటే జగన్‌ మాత్రం రాజ్యసభకు పంపించారని అన్నారు. అరెస్టు భయంతో ఢిల్లీకి పారిపోయిన పప్పు లోకేష్‌ మనకు అవసరమా? అని వ్యాఖ్యానించారు. సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు నాలుగు దిక్కుల్లాంటి వాళ్లని అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ 25 మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని చెప్పారు. చంద్రబాబు పాలేరు పవన్‌ కల్యాణ్‌ అని, పవన్‌ కల్యాణ్‌ చెంచా మనోహర్‌ అని ఎద్దేవ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని, పొన్నూరులో రోశయ్య గెలుపును ఎవరూ అపలేరని అన్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్‌, ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడారు. ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగాం సురేష్‌, ప్రభుత్వ సలహాదారు జూపూడి రమేష్‌, ఎమ్మెల్సీలు కె.రవి, పి.సునీత, ఎం.రాజశేఖర్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు ఎ.సదాశివరావు పాల్గొన్నారు.