Oct 10,2023 00:17

వినతిపత్రం చూపుతున్న బాధితులు నూకరాజు, భవాని

పజాశక్తి- బుచ్చయ్యపేట
మండలంలోని తైపురం రెవెన్యూ పరిధిలోని జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం తమ డి.ఫారం భూమి తీసుకుందని, దానికి పరిహారం చెల్లించాలని, మిగిలిన భూమిని తన పేరుతో అసైన్‌ చేయాలని మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళితుడు నందికోళ్ల నూకరాజు, ఆయన భార్య భవాని సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఆర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1996లో తన తండ్రి నందికొల్ల సాంబయ్యకు తైపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 276-4ఎలో 3.71 ఎకరాలు భూమికి డి-ఫారం పట్టా ప్రభుత్వం మంజూరు చేసిందని, ఖాతా నెంబరు 198గా ప్రభుత్వం తన తండ్రి పేరుతో పాస్‌ పుస్తకం ఇచ్చిందని తెలిపారు. ఈ భూముల్లో పండ్ల తోటలు పెంపకం చేపట్టామన్నారు. కుటుంబ అవసరాల రీత్య తన తండ్రి ఈ భూముల్లో ఫలసాయానికి తాకట్టుగా తైపురం గ్రామానికి చెందిన అల్లం అప్పారావు వద్ద నగదు తీసుకున్నామని చెప్పారు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారని, తాను ఉపాధి కోసం వలస వెళ్లిపోయానని తెలిపారు. 2020 సంవత్సరంలో తైపురం గ్రామంలో జగనన్న కాలనీకి ఎకరా 50 సెంట్లు భూమిని తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని రాళ్లు పాతారని తెలిపారు. సదరు భూమికి ప్రభుత్వం నుండి పరిహారంగా రూ.14 లక్షలు చెల్లిస్తామని తెలిపారని, కానీ నేటి వరకు పరిహారం అందలేదని పేర్కొన్నారు. అలాగే మిగులు భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తన పేరుతో మార్పు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకోవటం లేదని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరారు.