Oct 02,2023 00:31

జగనన్న ఇళ్ల స్థలాల కోసం వేసిన లేఅవుట్‌లో మట్టి తవ్వకాలు చేసిన దృశ్యం

ప్రజాశక్తి - పరవాడ
మండలంలోని పెదముషిడివాడ రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ మైనింగ్‌ దందా జరుగుతోంది. పట్టణ జగనన్న కాలనీలకు భూములిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం వేసిన లేఅవుట్‌లో రాత్రి వేళల్లో జెసిబితో గ్రావెల్‌ తవ్వకాలు చేసి లారీల్లో అక్రమంగా తరలించుకుపోతున్నారు. యథేచ్ఛగా ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నా ఇటు రెవెన్యూ, అటు మైనింగ్‌ అధికారుల పత్తాలేదు.
పెదముషిడివాడ రెవెన్యూ పరిధిలో పట్టణ జగనన్న కాలనీల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ఇదే రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 365లోని ప్రభుత్వ కొండపోరం బోకు భూమిలో లేఅవుట్‌ వేశారు. ఈ లేఅవుట్‌లో ఇళ్ల స్థలాలను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. ఈ నేపథ్యంలో ఈ లేఅవుట్‌లో గ్రావెల్‌ దందా మొదలైంది. ప్రతి రోజూ రాత్రి వేళల్లో జెసిబిలతో గ్రావెల్‌ తవ్వి లారీలతో చుట్టుపక్కల ఉన్న ఫార్మాసిటీ, అగనంపూడి, గాజువాక పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెదముషిడివాడలో ఒక చోటా వైసిపి నాయకుడు వేస్తున్న ఆనధికారిక లేఅవుట్‌లకు కూడా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్‌పై స్థానిక విఆర్‌ఓ అప్పారావుకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని, ఆయన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌ వెనుక స్థానిక అధికార పార్టీ నాయకుని హస్తం ఉందని, అందుకే స్థానికులు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇటు రెవెన్యూ అధికారులుగాని, అటు పోలీస్‌, మైనింగ్‌ అధికారులుగాని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని, అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.