
జగనన్న ఇళ్ల అవినీతిపై విచారణ జరిపించాలి
ప్రజాశక్తి-కావలి : చిరుజల్లులకే కూలిపోతున్న జగనన్న ఇళ్ల అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. స్థానిక ''జర్నలిస్ట్ క్లబ్'' లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేశారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో వేదిక కన్వీనర్ కరవది భాస్కర్, పసుపులేటి పెంచలయ్య, చింతాల వెంకట్రావు, జ్యోతిబాబురావు, కె.నాగరాజు, పొబ్బ సాయివిటల్, బలిజేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. కరవది భాస్కర్ మాట్లాడుతూ అవినీతి పునాదులపై ఏర్పడ్డ జగనన్న మెగా లేఅవుట్, కూలిపోక నిలబడుతుందా అని ప్రశ్నించారు. స్థల సేకరణ పేరిట తన బినామీలతో తక్కువకు కొని విలువ పెంచి ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వ ఖజానాను గండి కొట్టిన అవినీతి, లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, కాంట్రాక్టర్లకు కట్టి పెట్టడంలో అవినీతి, నీటి పైపులు ఏర్పాటులో అవినీతి, క్యూరింగ్ పేరుతో ప్రయివేట్ ట్యాంకర్లకు బిల్లులు చేసుకోవడం అవినీతి, ఇసుక అవినీతి, సిమెంటు రాయి అవినీతి, బినామీల పేరుతో లబ్ధిదారుల ఎంపిక అవినీతి ఇన్ని రకాల అవినీతితో ఏర్పడ్డ కాలనీ ''జగనన్న ఇళ్లు'' అని అన్నారు. సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న నాసిరకపు నిర్మాణాలను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇప్పుడు కేటాయిస్తున్న నిధులు సరిపోవని, లబ్ధిదారునికి 2సెంట్ల నివేశన స్థలం, కట్టుబడికి ఒక ఇంటికి రూ.5లక్షలు కేటాయించాలని అయన డిమాండ్ చేశారు. చింతాల వెంకటరావు(కాంగ్రెస్) మాట్లాడుతూ జగనన్న ఇళ్లల్లో అవినీతి లేదని, ఇళ్ల నిర్మాణం నాసిరకంగా లేదని, ఏదోక ఇళ్లు పడిపోయిన దానికి రాద్ధాంతం చేయొద్దు అంటున్న ఎంఎల్ఎకు జగనన్న ఇళ్లల్లో కనీసం వారం రోజులపాటు పాటు నివాసముండే దమ్ముందా అని సవాలు చేశారు. జ్యోతిబాబురావు (టిడిపి) మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణంలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్లు పేదలకు కాదని ఎంఎల్ఎ, అధికారులు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి మాత్రమే అని అన్నారు. టిడ్కో ఇళ్లను ఎగతాళి చేసిన వైసిపి నేతలు చిరుజల్లులకే కూలిపోతున్న జగనన్న ఇళ్లను ఏమనాలో వారే చెప్పాలన్నారు. దళిత, మైనార్టీల పథకాలను రద్దుచేసి, వారిని చావులకు గురిచేసి సామాజిక సాధికారిక యాత్రలు జరపడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. బలిజేపల్లి వెంకటేశ్వర్లు (సిపిఐ) మాట్లాడుతూ జగనన్న ఇల్లు ఇంత నాసిరకంగా నిర్మాణం అవుతుంటే క్వాలిటీ కంట్రోల్, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. హౌసింగ్ అధికారులే కాంట్రాక్టర్ల అవుతారమెత్తి, అత్యంత నాసి రకమైన ఇళ్లను నిర్మాణం చేస్తున్నారన్నారు. జగనన్న ఇళ్లు, నివాసానికి ఉపయోగపడని ఇళ్లు అని అన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో పెద్దలు దోచుకుతింటున్నారన్నారు. పొబ్బ సాయివిఠల్ (జనసేన) మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణం చూస్తుంటే పేదలంటే ఎంత చిన్నచూపో అర్థం అవుతుందన్నారు. చిరుజల్లులకే కూలిపోతుంటే విజిలెన్స్ అధికారులు నిద్ర నటించడం సరికాదన్నారు. తమ పోరాటంలో లబ్ధిదారులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో దమ్ము దర్గాబాబు, కె.నాగరాజు, నారాయణ, సునీల్, వేణు, ఆజాం, హఫీజ్, తదితరులు పాల్గొన్నారు.