
కరోనా కాలం ఓటీటీకి బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకూ ఓ మంచి వేదిక దొరికింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలూ ఓటీటీలో విడుదలవుతున్నాయి. పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో డైరెక్ట్గా విడుదలవుతున్న పెద్ద సినిమాల జాబితాలోకి ''జగమే తందిరం'' కూడా చేరింది. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళ హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులోకి కూడా డబ్ చేసి, విడుదల చేశారు. ఈ భాషలకు చెందని వారికి వెసులుబాటు కల్పించేలా అన్ని ఓటీటీ చిత్రాల్లాగానే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.
చిత్రం : జగమే తందిరం
నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, జేంస్ కాస్మోస్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
ఎడిటింగ్ : వివేక్ హర్షన్
కెమెరా : శ్రేయాస్ కష్ణ
నిర్మాత : శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం : కార్తిక్ సుబ్బరాజ్
విడుదల తేదీ : 18 జూన్ 2021
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
2012లో ఓపెన్ చేసిన ఈ కథకి నేపథ్యం ఎల్టీటీఈ అంతిమ దినాల్లోని శ్రీలంక తమిళుల కష్టాలు. శరణార్థులుగా వాళ్లు పడిన అగచాట్లు, బాధలు ఈ కథకి మూలం. అయితే లండన్లో శివదాస్ అనే ఒక తమిళ డాన్ ఉంటాడు. అతడి ప్రత్యర్థి తెల్లవాడైన గ్యాంగ్స్టర్ పీటర్. ఆ దేశంలో వేర్వేరు దేశాల నుంచి వచ్చే వలస కార్మికులకి అండగా, రేసిజంకి (జాతి వివక్షకు) వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతుంటుంది. కానీ పీటర్ రేసిస్టు. రేసిజంని తెర వెనుక నుంచి పెంచి పోషించే రాజకీయ నాయకులు పీటర్ని పరోక్షంగా ప్రోత్సహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జరిగే హింసాకాండలో పీటర్ తన ప్రత్యర్థి శివదాస్ని ఎదుర్కొనడంలో పడే కష్టాలని అధిగమించడానికి ఒక పన్నాగం పన్నుతాడు.
మదురైలో ఉండే సురుళి (ధనుష్) అనే లోకల్ డాన్ దగ్గరకి ఒక తమిళుడిని పంపుతాడు పీటర్. అతనొక ప్రొపోజల్ పెడతాడు. నెల రోజులు లండన్ వచ్చి పీటర్తో పని చెయ్యాలి. తన తమిళ ప్రత్యర్థిని పడగొట్టాలి. పని అయిపోయాక తిరిగి ఇండియా వెళ్లిపోవచ్చు. ఈ పనికి వారానికి రెండు లక్షల పౌండ్లు బేరం కుదుర్చుకుంటాడు సురుళి. మొత్తానికి లండన్లో దిగుతాడు. కన్సల్టెంట్ దాదా ఉద్యోగం మొదలుపెడతాడు.
అక్కడ అతనికొక తమిళమ్మాయి పరిచయమవుతుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. కానీ తనే ఒక కారణం వల్ల ఇతన్ని మట్టుబెట్టాలనుకుంటుంది. కారణాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకు ఇదే సస్పెన్స్.
ఇంతకీ సురుళి తమిళవాడయ్యుండి తెల్లవాడితో పనిచేసి, తమిళవాడినే చంపుతాడా? లేక మరో రకంగా ప్లేటు తిప్పుతాడా? లేక రెండూ చేస్తాడా? ఇవేమీ కాకుండా మరో విధంగా కథ మలుపు తిరుగుతుందా? తెలుసుకోవాలంటే రెండున్నర గంటల సినిమా వీక్షించాలి.
తమిళుల మనోభావాలు, ప్రాంతీయాభిమానం, శరణార్ధుల మానవ హక్కులు మొదలైన అంశాలని టచ్ చేస్తూ ఒక మాస్ యాక్షన్ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. అయితే ఇలాంటివి థియేటర్స్లో ఫ్యాన్స్ మధ్య బాగానే ఉండొచ్చేమో కానీ ఓటీటీలో సీరియస్గా, ప్రాక్టికల్గా, నేచురల్గా అనిపించాలి. ప్రస్తుతం స్ట్రీం అవుతున్న ''ఫ్యామిలీ మ్యాన్'' సిరీస్ ఈ విషయంలో ఒక బెంచ్ మార్క్.
''జగమే తందిరం'' కథ పరంగా స్పాన్ బాగానే ఉందనిపించినా, చాలా చోట్ల కథనాలు కృతకంగా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా తాజాగా ఎల్టీటీఈ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ చూశాక ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సురుళిగా ధనుష్ సగటు మాస్ హీరోగా న్యాయం చేశాడు. అక్కడక్కడా తన మామ రజినీకాంత్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించాడు. అత్తిల పాత్రలో ఐశ్వర్యలక్ష్మి కూడా తన పాత్ర వరకూ ఎమోషన్స్ బానే పండించింది.
గేం ఆఫ్ థ్రోన్స్లో కనిపించిన జేంస్ కాస్మోస్ ఇందులో పీటర్ పాత్రలో చేయాల్సినంత చెయ్యలేదనిపించింది. అతనిలో క్రుయాల్టీని చూపించే ప్రయత్నం కూడా దర్శకుడు పెద్దగా చెయ్యలేదు.
ఈ మధ్యనే వచ్చిన మలయాళ చిత్రం ''నాయట్టు''లో మెరిసిన జోజు జార్జ్ ప్రధానపాత్ర శివదాస్గా ఉన్నంతలో నిండుగా కనిపించాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం, సంతోష్ నారాయణ్ సంగీతం కూడా తమదైన శైలిలో ఉన్నాయి. ఆ స్టైల్ నచ్చేవారికి బాగానే ఉంటుంది.
ఇది సీరియస్ కథతో సాగే యాక్షన్ డ్రామా అయినప్పటికీ ఉన్నంతలో కామెడీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ప్రధానమైన మైనస్ ఏంటంటే నిడివి. రెండున్నర గంటలు చాలా ఎక్కువనిపిస్తుంది. అంచనాలకు, హైప్కి తగ్గట్టుగా లేదు ఈ సినిమా. ఈ సినిమాకి పాటలు పెద్ద అడ్డంకి. అవి వచ్చినప్పుడల్లా స్కిప్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మరింత భారమయ్యేది.
మెదడుని కదిలిస్తుంది తప్ప, మనసుకు పెద్దగా హత్తుకొనేలా లేదు ఈ సినిమా.