పరిశీలిస్తున్న కలెక్టర్
ఈవిఎంలు తనిఖీ :ప్రజాశక్తి-నెల్లూరుఎన్నికల కమిషన్ నిర్ణయించిన గడువులోగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తనిఖీ పూర్తిచేయాలని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉన్న ఓటింగ్ యంత్రాల గోడౌన్లో ఈవీఎంల పర్యవేక్షణ అధికారి , బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవీఎంల తనిఖీ ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఈవీఎంలు తనిఖీ పకడ్బందీగా , జాగ్రత్తగా చేయాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీలోగా ఈవీఎంల తనిఖీ పూర్తి చేయాలన్నారు. ఈవీఎం మిషన్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని వేరుగా భద్రపరచాలని సూచించారు. ఏ అధికారి సెల్ ఫోన్ తో ఈ వి ఎం గోడౌన్ లోకి ప్రవేశించ కూడదనే నిబంధన వుండటం తో ముందుగా ఆయన తన సెల్ ఫోనును ఏర్పాటు చేసిన కౌంటర్ లో అప్పగించి , రిజిస్టర్ లో సంతకం చేసి, తనిఖీ అనంతరం ఈవీఎం గోడౌన్ లోనికి వెళ్లారు. గోడౌన్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ మొదటి స్థాయి తనిఖీలో డిఆర్ఓ యస్ .లవన్న, ఆర్డీవో మాలోల, ఈవీఎం ల సూపర్వైజర్ సుధాకర్ రావు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.










