Nov 18,2023 18:43

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          ఇసుక సమస్యను పరిష్కరించి కార్మికుల ఉపాధిని కాపాడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణరావు ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా కమిటీ సమావేశం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో చీరా అప్పారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో రమణరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేసి నిర్మాణ కార్మికుల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ బోర్డు చట్టాల అమలు కోసం ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో రెడ్డి లక్ష్మణరావు, పరసా రాజేష్‌, సురేష్‌, పి.గోపి, కె.నవీన్‌ మాట్లాడారు.