
*కుళాయిలు వేసి అందించడానికి కసరత్తు
*పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీలో ప్రతి ఇంటికీ కుళాయిలు వేసి మంచినీరు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మున్సిపాల్టీలో వేసవిలో తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారని, రూ.వంద కోట్లతో ఇంటింటికీ మంచీరు అందించాలని పనులు ప్రారంభించామని తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే వారికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బి.గిరిబాబు, కమిషనర్ టి.నాగేంద్రకుమార్, మున్సిపల్ డిఇ బల్ల హరి, మున్సిపల్ ఎఇఇ అవినాష్, ఎఎంసి చైర్మన్ పివి సతీష్ కుమార్, వైస్ చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్ బాబు, స్థానిక కౌన్సిలర్ బెల్లాల శ్రీనివాసరావు, వైసిపి పట్టణాధ్యక్షులు సనపల సింహాచలం, మున్సిపల్ మాజీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.