ప్రజాశక్తి-అనంతపురం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం విత్తన తొలి ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాప్తాడు మండలంలో రైతు గోపాల్ పొలంలో అనంతపురం వ్యవసాయ డివిజన్ ఎడిఎ మీనల రవి, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వరప్రసాద్ ఆముదం పంటను వేసి తొలి ఏకాదశి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు రైతులందరూ కూడా విత్తనాలు ఏకాదశి సందర్భంగా సాగు ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రైతులు అందరి ఖరీఫ్ సాగు లాభదాయకంగా ఉండాలని ఆకాక్షించారు. రైతులకు ఇప్పటికే ఖరీఫ్ వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతు ముంగిటకు చేర్చామన్నారు. అంతేగాకుండా ఖరీఫ్ సాగుకు ముందే అవసరమైన పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందుకు అవసరమైన ప్రోత్సాహం కింద ఎంపిక చేసిన రైతులకు మినికిట్స్ రూపంలో విత్తనాలు అందిస్తుందన్నారు.
తొలి ఏకాదశి సందర్భంగా విత్తుతున్న ఎడిఎ రవి










