
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: మన్యం వీరుడు కొమరంభీమ్ 132వ జయంతి వేడుకలను బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నగరంలోని మహాత్మా జ్యోతిరావుపూలే పార్కులో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు మాట్లాడుతూ కొమురం భీమ్ దేశ విముక్తి కోసం, అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడన్నారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ, సోంబాయి దంపతులకు సంకేపల్లి గ్రామంలో 1901లో జన్మించారని గుర్తు చేశారు. ఆయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారన్నారు. నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టి పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో బాడాన దేవభూషణరావు, రౌతు శంకరావు, గుత్తు చిన్నారావు, అడపాక రాంబాబు, మరుల శంకరావు, పసగాడ రామకృష్ణ, తాళ్లూరి విజయ లక్ష్మణ్, పిట్టా భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
నందిగాం : మండలంలోని హర్షవాడ పంచాయతీ సవరలింగపురంలో నిర్వహించిన కొమరం భీం జయంతి వేడుకలో ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల కృష్ణారావు, ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పెద్దింటి నేపాల్, పెద్దింటి దొంగయ్య, పెద్దింటి ఫాల్గుణరావు, మాధవరావు, పెద్దింటి చంద్రరావు, పెద్దింటి ధనుంజయ, పెద్దింటి ప్రవీణ్ పాల్గొన్నారు.