Apr 09,2023 20:44

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
భీమవరం త్యాగరాజ భవనంలో చెరుకువాడ సోదరుల నిర్వహణలో హరికథ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అదివారం హరికథ భాగవతరాణి పురాణం విజయలక్ష్మి (రాజమండ్రి) శ్రీరామ సుగ్రీవ మైత్రి హరికథ అద్భుతంగా ప్రదర్శించారు. దీనికి సహా వాయిద్యాలుగా పాలపర్తి ఆంజనేయులు (విజయవాడ), మృథంగంతో కాపవరపు సుబ్బారావు (భీమవరం) వయోలిన్‌తో సహకరించారు. ఈ కార్యక్రమం సాగి అచ్చుత రామరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాగి విఠల్‌రంగరాజు సహకారంతో నిర్వహించినట్లు చెరుకువాడ సోదరులు తెలిపారు. ఎఎస్‌పి సుబ్బరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కళాకారులను సత్కరించారు. కళలకు పుట్టినిల్లు విజయనగరం అని, హరికథకు విజయనగరం ఆదిపట్ల నారాయణదాసు పునాది వేశారని అనడంలో గర్వంగా చెబుతున్నానని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ గంధం వెంకట విశ్వేశ్వరరావు, తిరువీధి వెంకటేశ్వర్లు, మాజీ ఎంఎల్‌సి బొమ్మిడి నారాయణరావు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు నందమూరి రాజేష్‌, నీలాతీ పోతయ్య పాల్గొన్నారు.