
సుమారు 400 ఏళ్ల క్రితం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవారు భారతదేశంలో అడుగుపెట్టారు. వ్యాపారం చేసుకునే తొలిరోజుల్లో ''జీ హుజూర్!'' అంటూ లొంగి లొంగి సలాములు కొట్టిన ఆ తెల్లవాళ్లు మన రాజుల ఆర్థిక బలహీనతలను కనిపెట్టి, అప్పులంటూ సొప్పులంటూ ఆశ చూపి.. చిన్నగా మనపై పెత్తనం మొదలుపెట్టారు. నూటయాభయ్యేళ్లు గడిచాయో లేదో కుట్రలు, కుతంత్రాలు పన్ని, బెంగాల్లో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ సువిశాలమైన భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వందేళ్లు పూర్తయ్యేసరికి వేలాది మంది భారతీయ సిపాయిలను హతమార్చి, ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి, బ్రిటిషు రాణికి అప్పజెప్పారు. ఆ తర్వాత 90 ఏళ్లు అత్యంత నిరంకుశత్వంతో పాశవికంగా మనపై అధికారం చెలాయించారు.
శతాబ్దాల తరబడి సాగిన తమ దుర్మార్గపు పాలనలో భారతదేశాన్ని దోచుకోవడంతో పాటు అడ్డొచ్చిన ప్రజలను దారుణంగా హతమార్చారు. తమ పాలనలో ఆంగ్లేయులు చేసిన ఘోరాలు మానవ చరిత్రలో చీకటిరోజులు. వారిచ్చే రెండణాల కూలీ తిండికే చాలదంటూ ఎదురుతిరిగిన మన్యప్రజలను బంధించారు. తలకిందులుగా వేలాడదీసి, కొరడాలతో కొట్టి, గుర్రాల కాళ్లకు కట్టి ఈడ్పించి, చీలిన చర్మంపై కారంపూసి, హింసించారు. వారి మర్మావయవాలలో కారం పోసి, ఎన్నో దారుణాలు చేశారు. ఆడవారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పురుషులని తుపాకీలతో కాల్చి చంపారు. ఇటువంటి దుర్మార్గాలు దేశమంతా కోకొల్లలుగా జరిగాయి. అయినా భారతీయులు భయపడకుండా 'మీ నిరంకుశత్వం మాకొద్దంటూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలంటూ' అహోరాత్రులు ఉద్యమించారు.
చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్లాంటి వారు పిస్తోళ్లతో గడగడలాడించారు. ఖుదీరాంబోస్, భగవతీచరణ్వోహ్రో లాంటివారు బాంబులను విసిరి, భయోత్పాతం సృష్టించారు. యుద్ధమే ప్రత్యామ్నాయమంటూ నేతాజీ, అహింసాయుత ఉద్యమమే మేలైన మార్గమంటూ గాంధీజీ.. ఇలా ఎందరో ఆగ్రహావేశాలతో ఎవరికి తోచిన మార్గాన వారు ఉద్యమాలు చేశారు. తొలిరోజుల్లో మేధావులు, ఉన్నత వర్గాలకే పరిమితమైన స్వాతంత్య్రోద్యమం గాంధీజీ రాకతో కోటానుకోట్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ యావత్ ప్రజానీకం ఉద్యమించడంతో బాటు సుభాష్ చంద్రబోస్ సాగించిన వీరోచిత యుద్ధపోరాటం, ఆయన స్ఫూర్తితో సాగిన 'బొంబాయి నౌకాదళ తిరుగుబాటు' ఆంగ్లేయులను భయోత్పాతంలో ముంచెత్తాయి. ఇటువంటి పరస్థితుల్లో ఈ దేశాన్ని పాలించడం కష్టసాధ్యమని బ్రిటిష్ వారికి అవగతమయ్యేలా చేశారు.
నేటికి భారతదేశ స్వాతంత్య్రోద్యమం ముగిసి, ఏడుపదులు దాటినా ఆ ఉద్యమస్ఫూర్తి చరిత్రకారులనే కాదు, కవులనూ, రచయితలనూ ఉత్తేజపరుస్తూనే ఉంది. ఉద్యమ స్వభావం, నడిచిన, నడిపించిన తీరు, నాయకత్వం అత్యద్భుతం. ఇందులో పాల్గొన్న ప్రముఖులతోపాటు సాదా, సీదా ప్రజలు-పురుషులు, స్త్రీలు, యువకులు, ముదసలులు ఒక్కరేమిటి సమస్త ప్రజానీకం నాడు ఉద్యమంలోకి ఉరికారు. సర్వం ఒడ్డారు. లాఠీదెబ్బలు తిన్నారు. కారాగారాలను కావాలించుకున్నారు. అదొక అపురూప సంరంభం. అలివిగాని ఉద్వేగం. అలాంటి వారిలో కొందరైన అన్నాప్రగడ కామేశ్వరరావు, అనుమోలు గోపాలరావు, ఎన్జి రంగా, గోగినేని తాతయ్య, ధీరవనిత భారతీదేవి రంగ, జాస్తి బసవపున్నయ్య, జొన్నలగడ్డ రామలింగయ్య, టంగుటూరి ప్రకాశం, తట్టా వెంకటనరసమ్మ, తుమ్మల దుర్గాంబ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, శ్రీపతి పండితారాధ్యుల మల్లిఖార్జునశర్మ, ముత్తేవి మాధవాచార్య, మొవ్వా నారాయణస్వామి, మోటూరు హనుమంతరావు, మైనేని బసవ పూర్ణమ్మదేవి, వట్టికూటి వెంకటసుబ్బయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, షేక్ అబ్దుల్ వాహెబ్, సూర్యదేవర అన్నపూర్ణమ్మ వంటి గుంటూరుకు జిల్లాకు చెందిన ఎందరో ఉద్యమకారులున్నారు. వీరందరి జీవిత విశేషాలను రచయిత తోటకూర వెంకట నారాయణ ''స్వాతంత్య్రమే మా జన్మహక్కని!'' అనే పుస్తకంలో పొందుపరిచారు. ఆ విశేషాలు జాతీయోద్యమ స్వరూప, స్వభావాలను వివరించారు. ఈ పుస్తకం ద్వారా ఎందరో ఉద్యమకారుల జీవిత విశేషాలను తెలుసుకోవచ్చు..
- ఉదయ్ శంకర్ ఆకుల
స్వాతంత్య్రమే మా జన్మహక్కని..!
రచన : తోటకూర వెంకటనారాయణ
ప్రతులు : 1000
పేజీలు : 226
వెల : రూ.180
ప్రతులకు : తోటకూర రామసీత
2-సి, గీతా రెసిడెన్సీ,
ఎన్టిఆర్ సెంటర్,
చిలకలూరిపేట-522616
గుంటూరు జిల్లా.
సెల్ : 9490634849