Aug 21,2023 23:01

గ్రూపులు లేకుండా ముందుకు సాగాలి : మంత్రి పెద్దిరెడ్డి
బార్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ
ప్రజాశక్తి- పుంగనూరు:
న్యాయవాదులు అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని గ్రూపులు లేకుండా ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక కోర్టు ఆవరణంలో బార్‌ అసోసియేషన్‌ నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాయవాదులకు బార్‌ అసోసియేషన్‌ భవనం చాలా అవసరమన్నారు. ఈసమావేశానికి కూడా ఇది చాలా అవసరమన్నారు. బార్‌ అసోసియేషన్‌ కోరగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించి కలెక్టర్‌ ను కోరడం జరిగిందని చెప్పారు. మనం అడిగిన వెంటనే కలెక్టర్‌ కూడా అనుమతులు ఇచ్చారని, భవన నిర్మాణం కోసం ఎంపి మిథున్‌ రెడ్డి రూ.25 లక్షలు, ఎంపి ఎన్‌.రెడ్డప్ప రూ.20లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. భవన నిర్మాణం కోసం కోర్టు పరిసర ప్రాంతంలో 5సెంట్ల భూమిని ప్రభుత్వం తరపున కేటాయించారని, దాదాపు రూ.50లక్షలతో బార్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. భవన నిర్మాణానికి అయ్యే కర్చు మొత్తాన్ని ఎంపి లాడ్స్‌ ద్వారా సమకూర్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపిలు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎన్‌.రెడ్డప్పలకు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్‌ పోకల అశోక్‌ కుమార్‌, పికెఎం చైర్మన్‌ ఎన్‌.వెంకట్రెడ్డి యాదవ్‌, స్టేట్‌ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ యాక్టివిటీ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు గల్లా శివశంకర్‌ నాయుడు, ఆనంద్‌ కుమార్‌, న్యాయవాదులు మల్లికార్జున రెడ్డి, అంజిబాబు, జితేంద్ర, పులి రామకష్ణారెడ్డి, ఆకుల చెన్నకేశవులు పాల్గొన్నారు.