Oct 20,2023 23:52

గొర్రెల మృతదేహాల వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు, స్థానికులు, సిఐటియు నేతలు

బ 32 జీవాలు అక్కడికక్కడే మృతి
బ మరో 15 గొర్రెలకు విరిగిన కాళ్లు
బ రూ. 5లక్షలకు పైగా నష్టం
బ లబోదిబోమంటున్న బాధితులు
బ బొగ్గు లారీలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌
ప్రజాశక్తి - పరవాడ
మండల కేంద్రం పరవాడ తహశీల్దారు కార్యాలయం సమీపంలో చెత్త నుండి సంపద కేంద్రం ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గొర్రెలు మందపై అతివేగంగా బొగ్గు లారీ దూసుకెళ్లడంతో 32 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 15 గొర్రెలకు కాళ్లు విరిగిపోయాయి. బాధితుల కథనం ప్రకారం... వెకువ జామున 4 గంటల సమయంలో అచ్యుతాపురం నుండి లంకెలపాలెం వైపు సుమారు 700 గొర్రెల మందను తోలుకొని పెంపకందారులు వెళుతున్నారు. ఆ సమయంలో వెనుక నుండి బొగ్గు లారీ అతివేగంగా, నిర్లక్ష్యంతో గొర్రెల మందపైకి దూసుకొచ్చి గొర్రెలను తొక్కించుకుంటూ వెళ్లిపోయింది. వెంటనే గొర్రెల కాపరులు బొగ్గు లారీని ఆపడానికి ప్రయత్నం చేయగా, ఆ లారీ డ్రైవర్‌ వారిని కూడా తొక్కించే విధంగా బెదిరించి లారీని ఆపకుండా వెళ్లిపోయాడు.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలానికి చెందిన ఉట్టిపులుసు శ్రీను, పత్రి గోవిందు, వారాది నర్శింహమూర్తి, వారాది సత్తిబాబు, వారాది రాము, పత్రి అప్పన్న తదితర గొర్రెల పెంపకందారులు ప్రతి ఏటా వర్ష కాలంలో ఈ ప్రాంతానికి వారి గొర్రెలు తోలుకొని వచ్చి మేపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి తిరుగు ప్రయాణంతో వెళ్తుండగా, ఈ ఘటన జరిగింది. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై గొర్రెల మేకల సహకార సొసైటీ జిల్లా చైర్మన్‌ గంట శ్రీరామ్‌, జిల్లా వైస్‌ చైర్మన్‌ సబ్బి శ్రీనివాసరావు ఆధ్వర్యాన బాధిత కుటుంబం నుండి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని, బొగ్గు లారీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న పరవాడ గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మనుసులను కూడా ఇదే విధంగా బొగ్గు లారీలు తొక్కుకుంటూ పోతాయేమోనని భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఒబిసి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌ఆర్‌.నాయుడు వెకువ జామున 5 గంటలకు సంఘటనా స్థలానికి వెళ్ల్లి గొర్రెల కాపరులను పరామర్శించారు. లారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
గొర్రెల కాపరులకు న్యాయం చేయాలని నిరసన
గొర్రెల కాపరులకు న్యాయం చేయాలని, బొగ్గు లారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ బొగ్గు లారీలు అధిక వేగంతో ప్రయాణించడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మూగజీవుల ప్రాణాలను బలి తీసుకున్న బొగ్గు లారీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు కాపర్లు, స్థానికులు పాల్గొన్నారు.