ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ దేశం గర్వించదగిన గొప్ప పోరాటయోధుడని మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి కొనియాడారు. అల్లూరి సీతారామరాజు వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ పరిధిలోని సిపిఎం కొత్తకాలనీలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎదురించి పోరాడిన నాయకుడు అల్లూరి అన్నారు. గిరిజన బిడ్డలను ఐక్యం చేసి పోరాటం సాగించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన వీరుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు పేరు చెపితేనే నేటితరం యువతరానికి ఎంతో ఉత్తేజాన్ని, పోరాట శక్తి కలిగిస్తాయని తెలిపారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు శివ, మోహన్, వలి, ఎస్ఎఫ్ఐ నాయకులు విజరు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరికి నివాళులర్పిస్తున్న డివైఎఫ్ఐ నాయకులు










