Nov 29,2021 08:01

రియల్‌ స్టోరీని ఎంచుకొని తీసిన కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి చిత్రాలను బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథకు.. కొంత ప్రేమను జోడించి ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా తెరకెక్కించిన చిత్రమే 'కపటనాటక సూత్రధారి'. ట్రైలర్‌తోనే ఎంతో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో? అసలు కథేంటో తెలుసుకుందాం..!

గోల్డ్‌ స్కాం కథాంశమే కపట నాటక సూత్రధారి



టైటిల్‌ : కపట నాటక సూత్రధారి
నటీనటులు : విజరు శంకర్‌, సంపత్‌ కుమార్‌, చందులాల్‌, మాస్టర్‌ బాబా ఆహిల్‌, అమీక్ష, సునీత, భానుచందర్‌, రవిప్రకాశ్‌, అరవింద్‌, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు
నిర్మాత : మనీష్‌ (హలీమ్‌)
దర్శకత్వం : క్రాంతి సైన
సంగీతం : రామ్‌ తవ్వా
నేపథ్య సంగీతం : వికాస్‌ బడిస
ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్‌
విడుదల తేదీ : నవంబర్‌ 12, 2021

కథలోకి వెళ్తే.. ఒక బస్తీలో ఉన్న ఐదుగురు మెయిన్‌ క్యారెక్టర్స్‌ విజరు శంకర్‌ (యాదగిరి), సంపత్‌ కుమార్‌ (సెంథిల్‌,) చందులాల్‌ (పూర్ణ), అమీక్ష (పుష్ప), సునీత (కల్పన) లు లైఫ్‌లో గోల్స్‌ను అచీవ్‌ కావాలని కలలుగంటారు. ఇందుకోసం ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి తరుణంలో బ్యాంకులో లోన్‌ ఇప్పిస్తామని ఒక బ్యాంక్‌ ఎంప్లారు చెప్పడంతో ఆ లోన్‌ అమౌంట్‌తో లైఫ్‌లో సెటిల్‌ అవ్వచ్చని లోన్‌కు అప్లై చేస్తారు. అయితే వీరు అప్లై చేసిన బ్యాంకులో ఓ కస్టమర్‌ తను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకొని వెళతాడు. తీరా చూస్తే అది నకిలీ బంగారం అని తేలుతుంది. అలా ఆ బ్యాంక్‌ వారు అసలు బంగారాన్ని మార్చి వన్‌ గ్రామ్‌ నకిలీ బంగారాన్ని కష్టమర్స్‌కు ఇస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది బ్యాంక్‌ కస్టమర్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, బ్యాంక్‌ మేనేజర్‌పై కంప్లైంట్‌ ఇస్తారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో అరవింద్‌ (రుద్ర) పోలీస్‌ ఆఫీసర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఇన్వెస్టిగేషన్‌ చేస్తాడు. అలా ఇన్వెస్టగేషన్‌ చేసే క్రమంలో బ్యాంక్‌ నుండి ఈ ఐదుగురు బస్తీ వారే కారణమని, వారే 30 ఫేక్‌ అకౌంట్లను ఓపెన్‌ చేసి 99 కోట్లు అనగా 200 కేజీల బంగారం స్కాం చేశారని బ్యాంక్‌ వారు వీరిపై తోసేస్తారు. దీంతో పోలీస్‌ ఆఫీసర్‌ రుద్ర ఈ బస్తీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేయడానికి వెళ్తే, వారు తప్పించుకొనే క్రమంలో వారిపై రుద్ర కాల్పులు జరపడంతో సునీత (కల్పన) చనిపోతుంది. ఆ తరువాత రుద్ర చేసే ఇన్వెస్టిగేషన్‌లో అసలైన సూత్రాధారులు దొరికారు అనుకున్న టైంలో భానుచందర్‌ (బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి), ఇలా ఒక్కొక్కరూ చనిపోతూ సినిమా మొత్తం సస్పెన్స్‌తో సాగుతుంది. చివరికి ఈ స్కాం ఎవరు చేశారు? ఎందుకు బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ చనిపోతుంటారు? స్కామ్‌ నుంచి ఐదుగురు బస్తీ వాసులు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా స్టోరీ..
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఎన్ని వచ్చినా సరే.. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నాడు. గతంలోనూ బ్యాంకు మోసాలకు సంబంధించిన అనేక కథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నసినిమా అయినా ఈ కోవలోకే చెందుతుంది 'కపట నాటక సూత్రధారి'. ఇందులోని నటులు చాలా వరకూ కొత్తవారైనా ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్‌ డ్రాప్‌ సెటప్‌, పాత్రల ఎలివేషన్స్‌ బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌ను సెలెక్ట్‌ చేసుకొని, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు క్రాంతి సైన సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. టెక్నికల్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. రామ్‌ తవ్వ మంచి సంగీతం అందించాడు. ఇందులో ఉన్న పాటలన్నీ ఫర్వాలేదు. బిజిఎం బాగుంది. సుభాష్‌ దొంతి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ చోటా కె.ప్రసాద్‌ పనితీరు బాగుంది. రామకృష్ణ అందించిన మాటలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌ అడ్డా పతాకంపై మనీష్‌ (హాలీమ్‌) ఈ సినిమాను నిర్మించారు. చిత్రం క్లైమాక్స్‌లో పార్ట్‌ 2 కూడా వుంటుందని చెప్పడం కొసమెరుపు. మొత్తంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ 'కపట నాటక సూత్రధారి' ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
    బస్తీవాసి యాదగిరిగా విజరు శంకర్‌ తనదైన నటనతో మెప్పించాడు. సెంథిల్‌ పాత్రలో నటించిన కమెడియన్‌ శివారెడ్డి తమ్ముడు సంపత్‌ కుమార్‌ చక్కటి నటనను కనబరిచాడు. తెలివైన కుర్రాడు పూర్ణగా పాత్రకు చందులాల్‌ న్యాయం చేశాడు. పూలమ్ముకునే యువతి పుష్ప పాత్రలో అమీక్ష ఒదిగిపోయింది. ట్రాన్స్‌జెండర్‌ కల్పనగా సునీత మెప్పించింది. పోలీసాఫీసర్‌ రుద్ర పాత్రలో అరవింద్‌ అద్భుత నటనను కనబరిచాడు. ఇన్వెస్టగేషన్‌ చేసే క్రమంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. బ్యాంక్‌ మేనేజర్‌గా భానుప్రసాద్‌, మేక రామకృష్ణ, విజరు, మాస్టర్‌ బాబా ఆహిల్‌, రవిప్రకాష్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.