ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక ఆగకూడదు: జేసీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యతాపనులకు సంబంధించి ఇసుకను నిరంతరాయంగా సరఫరా చేయాలని, రీచ్ల వద్ద నుంచి ఇసుక సరఫరా చేసేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. జెసి మంగళవారం నాడు జిల్లాలో ఇసుక లభ్యత సరఫరా గురించి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గ్రామాలలో భవన నిర్మాణాలకు ఇవ్వడం జరుగుతుందని ఇందులో ప్రధానంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, బిఎంసియులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ భవననిర్మాణాలకు ఎట్టిపరిస్థితులలోనూ ఇసుక సరఫరా ఆగకూడదని అన్నారు. అలా జరిగితే దీని ప్రభావం నిర్మాణ పనులు వేగవంతంపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమాలలో ప్రభుత్వ కార్యాలయ భవననిర్మాణాలు అత్యంత ప్రాధాన్యమున్నవని తెలిపారు. ఈ నిర్మాణాలకు వెళ్లే ఇసుక రవాణాలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అన్నారు. ప్రధానంగా మైనింగ్, పోలీసులు, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో భవన నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను సరఫరా అయ్యేటట్లు చూడాలన్నారు. నాడు- నేడు పనులకు సంబంధించి ఇండెంట్ వచ్చిన వెంటనే సంబంధిత పాఠశాలలో డంపు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన ఇండెంట్ల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని సమీపంలోని ఇసుక రీచ్ల నుంచి సరఫరా అయ్యేటట్టు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బసిరెడ్డి, డిడిమైన్స్ ప్రసాద్, ఏడిమైన్స్ అధికారులు వేణుగోపాల్, ప్రకాష్ కుమార్, పోలిరెడ్డి, జేపీ వెంచర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.










