Aug 07,2023 22:03

పాఠశాలలో భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఎపి ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌

        నార్పల : ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సిహెచ్‌ విజయ ప్రతాపరెడ్డి సోమవారం జిల్లాలోని బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమల మండలాల్లో పర్యటించారు. ముందుగా అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బార్సు హాస్టల్‌ను తనిఖీ చేశారు. భోజనాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే ఉన్న ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బార్సు స్కూల్‌ లో టిఫిన్‌ తనిఖీ చేసి రుచి చూశారు. బుక్కరాయసముద్రం గాంధీనగర్‌లో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తున్నారా అంటూ లబ్ధిదారులకు ఫోన్‌ చేసి విచారించారు. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనం పథకం అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం బుక్కరాయ సముద్రం మండలంలోని రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రేకులకుంట, దయ్యాలకుంటపల్లి, వెంకటాపురంలో రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. నార్పల మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి జగనన్న గోరుముద్ద పథకం అమలుపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసి పౌష్టికాహారం పంపిణీపై లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద అమలుపై తనిఖీ చేసి మెనూ అమలుపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. శింగనమలలోని కెజిబివి పాఠశాల, స్టాక్‌పాయింట్‌ గోడన్‌ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, డిఎస్‌ఒ శోభారాణి, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, డిటిడబ్ల్యువో అన్నాదొర, డీఈవో సాయిరాం, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.