
ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి ఎన్టిఆర్ జిల్లా ఆసుపత్రిలో మౌళిక వసతులు కల్పించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి సిపిఎం నాయకులు డిఆర్ఓ దయానిధికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ మాట్లాడుతూ 250 పడకలతో జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినా, అందుకు తగ్గట్టు వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించలేదన్నారు. పాముకాట్లు, విషపదార్ధాలు, లిక్విడ్స్ తీసుకున్న రోగులకు వైద్యం అందించలేక విశాఖ కెజిహెచ్కు రిఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో కొంత మంది సిబ్బంది విశాఖ కెజిహెచ్కు వెళ్ళాలని రోగులను బెదిరించి వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని విమర్శించారు. 46 మంది వైద్యలు ఉండాల్సి ఉండగా, 23 మంది, 66 మంది వుండాల్సిన నర్సింగ్ సిబ్బంది కేవలం 29 మంది మాత్రమే వున్నారని తెలిపారు. పారిశుద్య కార్మికులు తగినంత మందిలేరన్నారు. వారందరినీ నియమించాలని కోరారు. గర్భిణులకు ఆసుపత్రిలో టెస్టులు చేయాల్సి ఉండగా, లేవని వారిని ప్రైవేట్ ల్యాబ్స్కు పంపుతున్నారని తెలిపారు. మధ్యాహ్నం తరువాత సాధారణ రోగులకు వైద్య పరీక్షలు చేయడం లేదన్నారు. ల్యాబ్ 24 గంటలకు అందుబాటులో వుంచాలని డిమాండ్ చేశారు. సిటీ స్కాన్ 2019లో మరమ్మతులకు గురైనా దానిని నేటికీ దానిని అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. కీలక విభాగాలైనా గుండె, కిడ్ని, మెదడు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి విభాగాలకు అసలు వైద్యులే లేరని తెలిపారు. బెడ్స్ సరిపోక ఒక్కో బెడ్పై ఇద్దరు రోగులను వుంచుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా వైద్యం అందించవల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రులపై వుందని, పై సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనువాసరావు, ఆర్.శంకరరావు, నాయకులు ఎ.బాలకృష్ణ, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.