ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎమ్ఐజి లేఅవుట్తో పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని చిత్తూరు మండల తహశీల్దారు పార్వతి , చిత్తూరు పట్టణ అభివద్ధి సంస్థ (చుడా) వైస్ చైర్మన్ పీ విశ్వనాధ్ చెప్పారు. చిత్తూరు నగర పరిధిలో ఎంఐజీ లే అవుట్ ఏర్పాటు కోసం తిమ్మసముద్రం గ్రామపంచాయతీ కోడిగుంటపల్లి వద్ద సేకరించనున్న భూమికి సంబంధించి స్థానిక రైతులు, గ్రామస్తులతో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పార్వతి మాట్లాడుతూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 81 నుంచి 84 వరకు ఉన్న 35 ఎకరాల భూమిలో ఎంఐజీ లేఔటు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి డీకేటి, పట్టా భూములను సేకరించనున్నట్లు వివరించారు. భూసేకరణ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. స్థానిక రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మండల రెవిన్యూ అధికారి ధనుంజయ, గ్రామ రెవిన్యూ అధికారి దొరస్వామి, పట్టణ ప్రణాళిక సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి, వెంకటేష్, శివ మరియు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, కార్పొరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.










