Nov 14,2023 21:21

ప్రజాశక్తి - ఏలూరు
           విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని కోరుతూ సిపిఎం ప్రజా రక్షణ బేరి యాత్రలో భాగంగా చేపట్టిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీ మంగళవారం రాత్రి ఏలూరు నగరానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఉదయం బయలుదేరిన మోటార్‌ సైకిల్‌ యాత్రకు ఏలూరులో సిపిఎం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, నాయకులు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్‌ ప్లాంటును మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయివేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా వైసిపి ప్రభుత్వం పోరాడకుండా ప్రజలకు ద్రోహం చేస్తుందని విమర్శించారు. టిడిపి, జనసేనలు సైతం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కృషి చేయకుండా మోడీకి వంత పాడుతున్నాయని విమర్శించారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖ ఉక్కును కాపాడేందుకు సిపిఎం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 15వ తేదీన జరగనున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్‌, బి.సోమయ్య, కె.శ్రీనివాస్‌, జి.నరసింహారావు, వి.సాయిబాబు, కె.విజయలక్ష్మి, బి.జగన్నాధరావు, పివి.రామకృష్ణ, గోపి, ఎస్‌ఎన్‌.రమేష్‌, ఇస్సాక్‌ నాయకత్వం వహించారు.