
ప్రజాశక్తి - ఏలూరు
ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యురాలిగా మాజీ కార్పొరేటర్ కొంపెల్లి తాయారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రకటించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. డిప్యూటీ మాజీ మేయర్ గంపల బ్రహ్మావతి వ్యక్తిగత కారణాల వల్ల కో-ఆప్షన్ సభ్యురాలిగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి మాజీ కార్పొరేటర్ కొంపెల్లి తాయారు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. తాయారు పేరును 34వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ ప్రతిపాదించగా 16వ డివిజన్ కార్పొరేటర్ జుజ్జవరపు విజయనిర్మల బలపరచడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూక పయి సుధీర్బాబు మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం, ఎంఎల్ఎ ఆళ్ల నాని సహకారంతో ఎన్నికైన తాయారు నగర అభివృద్ధికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.