
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం: మండలంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వా ఆస్పత్రిలో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈదిపురం సర్పంచ్ నర్తు వరప్రసాద్ కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైస్ చైర్మన్లు దున్న గురుమూర్తి, వివేకానంద రెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనివార్య కారణాల వల్ల ఎంపిపి రాకపోవడంతో వైస్ చైర్మన్లు అధ్యక్షత వహించారు. సమావేశంలో శాఖల వారీగా సమీక్షా జరిగింది. ఇచ్ఛాపురం ప్రాంతంలో రొజు రోజుకీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, వారికి అనువుగా ఉండే ఈదూపురం ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కొలిగామ్ డాక్టర్ రేవతి దృష్టికి తీసుకొచ్చారు. జలజీవన మిషన్ పేరుతో పైపులైన్ కోసం రోడ్డుకు ఇరువైపుల తవ్వకాలు చెయ్యడంతో రోడ్లు దెబ్బతిన్నాయని మాజీ ఎంపిపి దక్కద ఏకాంభరి అన్నారు. జెఇ వంశీ సమాధానం ఇస్తూ రెండో ఫేజ్లో తవ్విన రోడ్లు బాగు చెయ్యడం జరుగుతుందన్నారు. తొందరలో స్టడీ ఎడ్యుకేషన్ అనాలిసిస్ సర్వ్ చెయ్యడం జరుగుతుందని విద్యాశాఖాధికారి అప్పారావు తెలిపారు. వెలుగు ఎపిఎం ప్రసాదరావు మహిళా సంఘాలు, ప్రభుత్వ పథకాలు, వలన కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపిడిఒ ఈశ్వరరావు, జెడ్పిటిసి ఉప్పాడ నారాయణమ్మ పాల్గొన్నారు.