డ్వాక్రా మహిళలను మోసం చేసిన వెలుగు, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి మండలం సత్యనారాయణపురం పంచాయితీలో నకిలీ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు కాజేసిన వెలుగు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎదుట సిపిఎం, ఐద్వా అధ్వర్యంలో బాధిత డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇక్కడ నుండి డిఆర్డిఎ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం పంచాయితీలో గ్రూపు సభ్యులకు తెలియకుండా నకిలీ గ్రూపులను ఏర్పాటు చేసి అనకాపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో సుమారు 75 లక్షల రూపాయలు, కొత్తూరు, పంచాయితీలో 2 గ్రూపుల ద్వారా మరో 30 లక్షలు రూపాయలు రుణాలు మంజూరు చేయించి బ్యాంకు అధికారులు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై కాజేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ క్రాంతి పథం (వెలుగు) సిబ్బంది పాత్ర, బ్యాంకు అధికారులు చేసిన ఈ స్కాం పై సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సభ్యులకు సంబంధం లేకుండా జరిగిన వ్యవహారంలో సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఐద్వా జిల్లా నాయకులు డిడి వరలక్ష్మి మాట్లాడుతూ ఇంతటి అవినీతి వ్యవహారం జరుగుతున్నా దీనిని పర్యవేక్షించాల్సిన మండల ఎపిఎం, సిసిలు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. వెలుగు జిల్లా ఉన్నత అధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా నాయకులు జి.సుభాషిణి, నందిక నాగమణి, ఉపమాక లక్ష్మి, బోడి ఝాన్సీ, బొబ్బిలి గాయత్రి, నందిక విజయ, ఆకులు దేవ, ఉప్పాటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.