Jul 14,2022 22:33

దంత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రాష్ట్ర ముఖ్యసలహాదారు అజేరు కల్లాం
చిత్తూరులో సుష్మ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ప్రారంభం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ప్రతి ఒక్కరూ తమ దంతాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యసలహాదారు అజేరు కల్లాం సూచించారు. గురువారం ఉదయం స్థానిక సుందరయ్యవీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సుష్మ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను అజేరు కల్లాం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ శరీర అవయవాల్లో దంతాలు అతి ప్రధానమైనవని, అలాంటి దంతాలను ఏడాదిలో రెండుసార్లు అనుభవజ్ఞులైన దంతవైద్యులచే శుభ్రం చేసుకోవడంతో పాటు, రోజుకు రెండుసార్లు బ్రెష్‌ చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే పళ్ళు పుచ్చిపోవడం, నోటీ దుర్వాసన రావడంతో పాటు నోటి క్యాన్సర్‌ తదితర ప్రాణాంతక జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. చెన్నై, బెంగళూరు తదితర మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా చిత్తూరు నగరంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన సుష్మ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలో నిర్వహించే వైద్య సేవలను చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ దంతాలను సంరక్షించుకోవాలని తెలిపారు. వైద్యశాల నిర్వహకులు డాక్టర్‌ సుకేష్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకరరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని హంగులతో ఏర్పాటు చేసిన సుష్మ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో స్మైల్‌డిజైన్‌, ఆర్థో క్లిప్స్‌, ఇన్‌ ప్లాంట్స్‌, రూట్‌ కెనాల్‌, ఫ్లాప్‌ సర్జరీ, ఓపిజి, బిపిఎస్‌ డెన్సెస్‌, ఫ్లెక్సీ డెన్సెస్‌, కాస్మెటిక్‌ ట్రీట్మెంట్‌ లాంటి చికిత్సలు లభ్యమవుతాయన్నారు. అతి త్వరలోనే తమ వైద్యశాలలో ఎంప్లాయిస్‌ హెల్త్‌స్కీమ్‌, ఆరోగ్యశ్రీ సేవలను సైతం అందుబాటులోకి తెస్తామని వారు స్పష్టం చేశారు. వైద్యశాల ప్రారంభానికి ఏపీఎస్‌ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానంద రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల రెసిడెన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంధ్య, ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కిషోర్‌ హాజరై వైద్యశాల నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సుష్మ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అజేరు కల్లాంకు పండ్ల పరిశ్రమ నేతల సన్మానం
దంత వైద్యశాల ప్రారంభానికి చిత్తూరు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేరు కల్లాంను పండ్ల పరిశ్రమ యజమానుల సంఘం నేతలు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, బాబి, ధనంజయ, అమర్నాథ్‌లు స్వాగతం సన్మానించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.