దళితులపై దాడులు, దౌర్జన్యాలు
ప్రజాశక్తి-కావలి : దళితులపై దాడులు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని దళితులకు ఎవరు దిక్కు అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ప్రశ్నించారు. బుధవారం కావలి ఆర్డిఒ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎఒకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.మల్లి మాట్లాడుతూ జగనన్న రాజ్యంలో దళితులకు గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో గాంధీ జయంతి రోజు విశాఖపట్నంలోని పద్మనాభం పోలీస్ స్టేషన్లో దళితులను తీసుకువచ్చి చితకొట్టి కాలు, చేయి విరిచారని తద్వారా చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. పాపు అనే యువకుడిని అసలు ఏ కారణం లేకుండా పోలీస్ స్టేషన్ వెనుకకు తీసుకువెళ్లి కొట్టారని తెలియజేశారు. సమస్యలను గ్రామంలో పరిష్కారం చేసుకుంటారా.. తమకు డబ్బులు ఇవ్వకుండా.. అంటూ చితకొట్టారని ఆవేదన వ్యక్త పరిచారు. అలాగే విశాఖపట్నంలోని డాక్టర్ సుధాకర్ రావును కాళ్లు చేతులు కట్టి తోపుడు బండిపై ఊరంతా తిప్పికొట్టారని, ఆ అవమానంతో అతను మరణించారని తెలియజేశారు. అలాగే ఎంఎల్ఎసి సుబ్రహ్మణ్యం డ్రైవర్ను కూడా చంపి డోర్ డెలివరీ ఇచ్చారని తెలియజేశారు. ఈ సంఘటనలే కాకుండా నిత్యం దళిత, గిరిజనులకు అధికార పార్టీ వారు చెప్పిన వారిని పోలీసులు చితక్కొడుతున్నారన్నారు. జగనన్న రాజ్యంలో క్రూరమైన హింస దళితులపై ప్రయోగిస్తున్నారని తెలియజేశారు. కనీసం మానవత్వం కూడా లేకుండా సాటి దళితులపై సానుభూతి చెప్పకుండా జగనన్న నవ్వుకుంటున్నారని ఇట్లాంటి దుర్మార్గులకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, వెంకటరత్నం, ముక్కు మోహన్ రావు, లక్ష్మినర్సు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.










