దళిత గ్రామాలకు వైసిపి పెద్దపీట
ప్రజాశక్తి-కోవూరు : వైసిపి ప్రభుత్వం కృషితో టిటిడి దేవస్థానం చొరవతో దళిత గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు పెద్దపీట వేసిందని మాజీ మంత్రి కోవూరు ఎంఎల్ఎ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు మండలాల్లోని దళిత గ్రామాల్లో నిర్మించిన ఆలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని 38దేవాలయం నిర్మాణాలకు టిటిడి బోర్డు ఆర్థిక సాయంతో రూ.3కోట్ల 80లక్షలను ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కొక్క ఆలయం నిర్మాణం కోసం రూ.10లక్షలు చాలడం లేదని ప్రజాభిప్రాయం ప్రకారం ఈ నగదును ఈ దఫా రూ.20లక్షలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. జమ్మిపాలెం గ్రామంలో ఆసరా పథకం కింద మహిళకు రూ.5లక్షల నగదును అందజేశారు. జెడ్పి నిధులు నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.12లక్షలు మంజురు చేసినట్లు జెడ్పిటిసి శ్రీలత అన్నారు. రైతులకు హమీలా ఛార్జీలను ప్రభుత్వం నుండి రావాల్సి ఉండగా ఎంఎల్ఎ కృషితో రూ.24లక్షల 65వేలు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలు సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దేవస్థానం ప్రారంభం కార్యక్రమానికి విచ్చేసిన ఎంఎల్ఎ ప్రసన్న కుమార్రెడ్డికి గ్రామస్తులు నాయకులు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మెన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ చేర్మెన్ రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, డిఎల్డిఎ డైరెక్టర్ కాటంరెడ్డి దినేష్ రెడ్డి, ఎంపిపి పార్వతి, వేగూరు చంద్ర, గుత్తికొండ వెంకయ్య, వైసీపీ మండల్ కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి పాటూరు ప్రసాద్, మాజీ ఎంపిపి ఓగు నాగేశ్వరావు, ఎంపిడిఒ శ్రీహరి, పలు శాఖల అధికారులు, వలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.










