
ప్రజాశక్తి -మధురవాడ :జివిఎంసి ఐదోవార్డులో తిష్టవేసిన దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ మొల్లి హేమలత కోరారు. గురువారం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ సాయికాంత్వర్మకు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారికి వినతిపత్రం అందజేశారు.
5,6,7,8 వార్డులకు ప్రధానకూడలి అయిన మధురవాడ ఫ్లైఓవర్ వంతెన వద్ద చిన్నపాటి వర్షం కురిసినా నీరు నిల్వ ఉండి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తందన్నారు. ఈ కూడలి మీదుగా జివిఎంసి జోనల్ కార్యాలయం, పిహెచ్సి, విద్యుత్ కార్యాలయం, చంద్రంపాలెం ఉన్నత పాఠశాల, పోలీస్స్టేషన్, మధురవాడ మార్కెట్, రైతుబజారుకు స్థానిక ప్రజలు వెళ్లాలంటే ఈ కూడలిని దాటి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా కొమ్మాది జంక్షన్ నుంచి చంద్రంపాలెం వరకు సర్వీస్ రోడ్డుపై వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.
వార్డులోని బొట్టవానిపాలెం, నగరంపాలెం చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ప్రజాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, జెఎన్ఎన్యుఆర్ఎం కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఎన్టిఆర్ హుదూద్ కాలనీ, తదితర కాలనీలకు తాగునీరు, రహదారులు, యుజిడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జలజీవన్ మిషన్ అయ్యప్పనగర్ తాగునీటి ప్రాజెక్టులో భాగంగా వికలాంగుల కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కార్పెంటర్స్ కాలనీ ప్రాంతాలకు పైపులైన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు.వార్డులో వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి బిసిసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఉన్నారు.