
ఉమ్మడి గోదావరి జిల్లాల సాగుకు 91.35 టిఎంసిల నీరు అవసరం
అందుబాటులో ఉన్నది 82.49 టిఎంసిల నీరే
వంతులు, నీటిని ఎత్తిపోసే విధానాల్లో సాగునీరు అందజేత
మార్చి నెలాఖరుకు కాలువల మూసివేత
గుర్రపుడెక్క, తూడు తొలగించి శివారు భూములకు సాగునీరు అందించేలా ఆదేశాలు
జిల్లా ఇన్ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్
కరువు మండలాలపై తీర్మానానికి సమావేశం విముఖత
కీలకమైన సాగునీటి సమావేశానికి ఐదుగురు ఎంఎల్ఎలు డుమ్మా
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలోని దాళ్వా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సమృద్ధిగా సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సంయుక్త సమావేశంలో దాళ్వా సాగుకు నీటి లభ్యత, పంటల ప్రణాళికపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా జిల్లాలో అందుబాటులో ఉన్న నీటిని దాళ్వా సాగుకు పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పటిష్టమైన నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నెలాఖరుకల్లా నారుమళ్లు వేసుకునేలా రైతులను సమాయత్తం చేయాలని, రైతుభరోసా కేంద్రాల స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటి లీకేజీలను అరికట్టడం, షట్టర్లు మరమ్మతులు చేయించడం, చెరువులు, కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క తొలగించి శివారు భూములకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు తెలిపారు. ఏలూరు జిల్లాలో 56,190 ఎకరాల్లో దాళ్వా సాగు చేస్తారని అంచనా వేస్తున్నామని, దీనికి తగిన విధంగా రైతులు ఈ నెలాఖరులోగా నారుమళ్లు వేసుకునేలా చూడాలని, అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వరిసాగుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, తృణధాన్యాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. దాళ్వాసాగుకు సంబంధించి గోదావరి డెల్టా పరిధిలోని విభజిత ఐదు జిల్లాలకు నీటి సరఫరా నిమిత్తం (తాగునీటితో కలిపి) 91.35 టిఎంసిల నీరు అవసరమన్నారు. సాగునీటి కోసం సీలేరు నుండి 40 టిఎంసిలు, గోదావరి జలాల ద్వారా 30 టిఎంసిలు, పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వలు 12 టిఎంసిలు మొత్తం 82.49 టిఎంసిలు నీరు అందుబాటులో ఉందన్నారు. ఖరీఫ్లో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. జెడ్పి ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ శివారు ప్రాంత రైతులకు సాగునీరు పూర్తిగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, కాల్వల్లో తూడు , గుర్రపుడెక్క తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి నెలాఖరుకు కాలువల మూసివేతకు సమావేశం నిర్ణయం తీసుకుంది. ఎర్రకాలువ ప్రాజెక్టు కింద 10,017 ఎకరాలు, జల్లేరు ప్రాజెక్టు కింద 3,400 ఎకరాలకు దాళ్వాలో సాగునీరు అందించాలని సమావేశంలో నిర్ణయించారు.
నెలాఖరుకు నారుమడుల పూర్తికి చర్యలు: కలెక్టర్
జిల్లాలో రబీ సాగుకు కావాల్సిన నీరు అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బందీ లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మండల, ఆర్బికె స్థాయిల్లో కూడా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అన్నివిధాలా అండగా ఉంటున్నామన్నారు. జిల్లాలో ఇ-క్రాప్ నమోదు చేయించి, రైతులందరినీ ఇకెవైసి చేయించామన్నారు. పంట నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు పంటల బీమా లేదా పెట్టుబడి రాయితీ అందిస్తున్నామన్నారు. జిల్లాలో రబీకి సాగు, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాల్వల్లో నీరు సాగుకు, తాగుకు, పశువులకు వినియోగించే అవకాశం ఉన్నందున తూడు, గుర్రపుడెక్క తొలగింపులో రసాయనాలు, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా యంత్రాలు లేదా కూలీలతో తీయించాలన్నారు. మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా పంట నష్టం జరిగినా నిబంధనల మేరకు పంటల బీమా కచ్ఛితంగా వస్తుందన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో అపరాలు, తృణధాన్యాలు వరికి బదులు ప్రత్యామ్నాయంగా వేసుకోవాలని సూచించారు. పోలవరం బేసిన్లో నీరు నిల్వచేసి దానిని రబీ సాగుకు వినియోగించుకునేలా సమావేశం తీర్మానం చేసిందన్నారు.
తూడు, గుర్రపుడెక్క తొలగించి శివారు భూములకు నీరివ్వాలి
ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు
కొల్లేరు ప్రాంతంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, తూడు, గుర్రపుడెక్క నిర్మూలనకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎంఎల్సి జయమంగళ వెంకట రమణ కోరారు. డ్రెయిన్లపై ఆక్రమణలు తొలగించాలన్నారు. కృష్ణా బోర్డుతో మాట్లాడి సాగర్ నుండి వచ్చే నీరు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఎంఎల్సి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సక్రమమైన నిర్వహణతో రబీలో సాగునీరు అందించాలన్నారు. ఉంగుటూరు ఎంఎల్ఎ పుప్పాల శ్రీనివాసు (వాసుబాబు) మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు, గణపవరం మండలాల్లో వెంకయ్యవయ్యేరు కాలవలో తూడు, గుర్రపుడెక్క తొలగించి శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని కోరారు. దీనిపై ఇరిగేషన్ ఎఇలు, డిఇలు దృష్టి పెట్టాలన్నారు. చింతలపూడి ఎంఎల్ఎ ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ ఎ.పోలవరంలో 110 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు కొంతమేర ఆక్రమణలకు గురైందని, వాటిని తొలగించడంతోపాటు పూడిక తీసి చెరువును పునరుద్దరించాలని కోరారు. సమావేశంలో డిఆర్ఒ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, ఇరిగేషన్ ఎస్ఇ వై.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై.రామకృష్ణ, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ సాల్మన్రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ ఎన్వివి.సత్యనారాయణ, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, నాబార్డు డిడిఎం నవకాంత్, ఎల్డిఎం నీలాద్రి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మంజుభార్గవి పాల్గొన్నారు.
కరువు మండలాలపై తీర్మానం చేయండి
షేక్ సాబ్జీ, పిడిఎఫ్ ఎంఎల్సి
ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పలు మండలాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలు దెబ్బతిన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా సమావేశంలో తీర్మానం చేయాలని పిడిఎఫ్ ఎంఎల్సి షేక్ సాబ్జీ కోరారు. అయితే దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు విముఖత వ్యక్తం చేశారు. అక్టోబర్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, కాబట్టి కరువు మండలాల ప్రకటనకు నిబంధనలు వర్తించవని చెప్పారు. దీనిపై సిఎంకు నేరుగా వినతి ఇవ్వాలని ఎంఎల్సి సాబ్జీకి సూచించారు. దెబ్బతిన్న పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందని, ఆర్బికెల ద్వారా సమోదైన పంటలకు నష్టపరిహారం అందుతుందని సమావేశంలో తెలిపారు. గోదావరి ఆయకట్టులో శివారు భూములకు సాగునీరు అందించాలంటే కాలువల్లో పేరుకుపోయిన గుర్రెపుడెక్క, తూడు తొలగించేవిధంగా ప్రణాళికలు అమలు చేయాలని సాబ్జీ కోరారు.
కీలక సమావేశాలకు ఎంఎల్ఎలు డుమ్మా
ప్రజా సమస్యలపై జిల్లాస్థాయిలో జరుగుతున్న కీలక సమావేశాలకు పలువురు ఎంఎల్ఎలు డుమ్మా కొడుతున్నారు. మంగళవారం జరిగిన జిల్లా సాగునీటి సలహామండలి సమావేశానికి ఏలూరు జిల్లాలో ఏడుగురు ఎంఎల్ఎలకుగాను ఉంగుటూరు, చింతలపూడి ఎంఎల్ఎలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు ఎంఎల్ఎలు రాలేదు. జిల్లా పరిషత్ సమావేశాలకు సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.