ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చేపట్టనున్న చలోవిజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కప్పల నాగభూషణం, జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్లు కావస్తున్నా మున్సిపల్ కార్మికుల తలరాతలు మారలేదన్నారు. అంతేగాకుండా అవార్డుల పేరిట మున్సిపల్ కార్మికులకు ఉన్నతాధికారులు రూ.50 విలువజేసే హాట్బాక్సులు (చిప్ప)లు ఇచ్చి అవమానించడం బాధాకరమన్నారు. వీటిని ఆదివారం వెనక్కి ఇచ్చి నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీవో 010 ప్రకారంగా వేతనాలివ్వాలని, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమిస్కిల్డ్ అమలు చేయాలని, రెగ్యులర్ కార్మికులకు రెండేళ్ల బకాయి సెల్ండర్ లీవ్లు ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేస్తూ, ఒపిఎస్ అమలు చేయాలని, జిపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలని, నగరాలకు అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచాలని, కోవిడ్, మలేరియా, గార్బేజ్, కార్మికులను ఔట్సోర్సింగ్ కార్మికుల గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారి స్వామి, మురళి, మల్లి, గౌరీ, ఓబుళపతి, సూరి, సురేష్, కాంతమ్మ, వెంకటలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.
జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు










