
'చలో విజయవాడ' జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి -కావలి రూరల్ : నవంబర్ 15న విజయవాడలో నిర్వహించే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్, ఎస్.పుణ్యవతి రాష్ట్ర నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలతో పాటు మన రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఈ బహిరంగ సభలో ప్రజలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్కె అమీర్ బాషా, పసుపులేటి తిరుపాలు, కె చెన్నయ్య, పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.