
మామిడి ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు
నూజివీడు మున్సిపాల్టీలోని ఒక్కో సచివాలయ పరిధిలో అభివృద్ధికి రూ. కోటి
నూజివీడు సభలో సిఎం జగన్మోహన్రెడ్డి
సభకు పెద్దసంఖ్యలో కాలేజీ విద్యార్థుల తరలింపు
పోలీసుల ఆంక్షలతో జనం తీవ్ర ఇబ్బందులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/నూజివీడు టౌన్
చింతలపూడి ఎత్తిపోతల పథకంపై తనకు అవగాహన ఉందని, ప్రాధాన్యతా క్రమంలో యుద్ధప్రాతిపదికన ఈ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సిఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, లంక భూములకు పట్టాలివ్వడం, చుక్కల భూములు, షరతుల గల పట్టాభూములు, సర్వీస్ ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఒఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని సిఎం నూజివీడులో శుక్రవారం ప్రారంభించారు. 10.45 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన హెలీపాడ్కు చేరుకున్న సిఎంకు మంత్రులు, ఎంఎల్ఎలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డుమార్గం గుండా సభాస్థలికి సిఎం చేరుకున్నారు. భూముల రీసర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ను సిఎం పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని వైఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వాగతోపన్యాసం చేశారు. ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి సహకారం అందిస్తూ, మెడికల్ కాలేజీ స్థాపించిన సిఎం జనాల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు. ఏలూరు జిల్లాలో భూమిలేని నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 752 మంది పేదలకు 693.25 ఎకరాల భూపంపిణీ ప్రభుత్వం చేస్తుందన్నారు. జిల్లాలో 13,077 మందికి చెందిన 16,446 ఎకరాలను భూముల రిజస్ట్రేషన్ చట్టం నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్సి సామాజిక తరగతికి శ్మశానవాటికల కోసం 31 గ్రామాలకు 33.32 ఎకరాలు ఆయా గ్రామ పంచాయతీలకు అందించామన్నారు. భూరక్ష పథకం ద్వారా జిల్లాలో ఆరు గ్రామాలకు ఆర్ఒఆర్ పూర్తయ్యి.. యాజమాన్య పత్రాల జారీ జరగబోతుందని తెలిపారు.
ఎంఎల్ఎ కోరారు.. సిఎం హామీ ఇచ్చారు
నూజివీడు ఎంఎల్ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గతంలో నూజివీడు నియోజకవర్గానికి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. తాగునీరు, ట్రిపుల్ ఐటి ఏర్పాటు, ఎస్టిలకు ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. చంద్రబాబు నూజివీడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. సిఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ జగన్ గెలిచి రెండోసారి సిఎం అవుతారన్నారు. టిడిపికి రెండు సీట్లు రావడం గగనమే అన్నారు. నూజివీడు మున్సిపాల్టీలో అభివృద్ధి లేకుండా పోయిందని, పట్టణంలో 32 వార్డులు ఉన్నాయని, సచివాలయానికి రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరారు. మామిడి ప్రొసెసింగ్ యూనిట్కు సంబంధించి రూ.275 కోట్ల అంచనాలతో రెండో ఫేజ్లో ఉందని, దీనికి 26 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. సాగునీటికి అత్యంత అవసరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఎంఎల్ఎ కోరారు. సిఎం తన ప్రసంగంలో ఎంఎల్ఎ అడిగిన వాటిపై మాట్లాడుతూ నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 16 సచివాలయాలు ఉన్నాయని, ఒక్కో సచివాలయానికి రూ.కోటి చొప్పున నిధులిస్తున్నట్లు ప్రకటించారు. నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.275 కోట్లతో మామిడిగుజ్జు ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేసి బ్యాంకులకు పంపించడం జరిగిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. సిఎం తిరిగి వెళ్లేటప్పుడు హెలీప్యాడ్ వద్ద వైసిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మిథున్రెడ్డి, జిల్లాలోని ఎంఎల్ఎలు కొఠారు అబ్బాయచౌదరి, ఎలిజా, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, జెడ్పి ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కాలేజీ విద్యార్థుల తరలింపు
శుక్రవారం నాగులచవితి కావడంతో మహిళలు పెద్దగా సిఎం సభకు రాలేదు. దీంతో స్థానికంగా ఉన్న కాలేజీ విద్యార్థులను పెద్దఎత్తున సిఎం సభకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సైతం పెద్దఎత్తున జనాన్ని సభకు తరలించారు. పోలీసుల ఆంక్షలతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిఎం సభ పూర్తయిన తర్వాత కూడా గంటవరకూ ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.