
ప్రజాశక్తి - వినుకొండ : టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కనబడడం లేదని, అటువంటి వారికి వార్డుల్లో అభివృద్ధి పనుల కేటాయింపు ఎందుకని 26వ వార్డు కౌన్సిలర్ గంట కాలేషా ప్రశ్నించారు. వినుకొండ పురపాలక సంఘం సాధారణ సమావేశం గురువారం చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఎజెండాలోని 29 అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గంటా కాలేషా మాట్లాడుతూ తమ వార్డులో ఇప్పటి వరకు రూ.38 లక్షల వర్కులు పెట్టగా రూ.8 లక్షల పనులే జరిగాయని, కాంట్రాక్టర్ ఎవరికి కనపడలేదని అన్నారు. అధికారికంగా టెండర్ ప్రక్రియ ద్వారా పనులు పొందే కాంట్రాక్టర్ ఒకరు కాగా మరొకరు పనులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. పనులు చేసే వారికే వాటిని కేటాయించాలని కోరారు. దీనికి కమిషనర్ వెంకయ్య స్పందిస్తూ పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 19వ వార్డు కౌన్సిలర్ బాష, 4వ వార్డు కౌన్సిలర్ హిమబిందు, 8వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ వార్డుల్లో లో వోల్టేజీ సమస్య ఉందని, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. బ్రిటిష్ కాలంలో వేసిన ఐరన్ పోల్స్ను తొలగించి సిమెంట్ పోలీసు వేయాలన్నారు. 5వ వార్డు కౌన్సిలర్ అంజనీదేవి, 7వవ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ తమ వార్డుల్లో డ్రెయినేజీ సమస్య నెలకొందని, కుళాయిల్లో మురుగునీరు వస్తోందని, నివాస స్థలాల్లో గడ్డి పెరిగి పాములు సంచరిస్తున్నాయని చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులను చైర్మన్ ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న భూ రీసర్వేకు అందరూ సహకరించాలని కమిషనర్ కోరారు. ఖాళీ స్థలాలు, గృహాల పూర్తి వివరాలను వెబ్ల్యాండ్ ద్వారా నమోదు చేయనున్నట్లు చెప్పారు. రీ సర్వే బృందానికి ప్రజలు వారి ఆస్తి డాక్యుమెంట్, ఆధార్, ఫొటోలు ఇవ్వాలని కోరారు.