Oct 10,2023 00:21

నివాళులర్పిస్తున్న విద్యార్థులు, యువకులు

ప్రజాశక్తి - పరవాడ
యువత చే గువేరా అడుగుజాడల్లో నడవాలని, ఆకలి లేని రాజ్యం కోసం పోరాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని వాడచీపురుపల్లిలో సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చే గువేరా వర్థంతి కార్యక్రమంలో చే చిత్రపటానికి గనిశెట్టి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొలీవియా విముక్తి పోరాటం చేస్తున్న చే గువేరాను అమెరికా ఆదేశాలతో బొలీవియన్‌ సార్జెంటు కాల్చివేసినట్లు తెలిపారు. టైం మ్యాగజైన్‌ చేత శతాబ్ది పురుషునిగా గుర్తింపు పొందిన చే గువేరా 1928 జూన్‌ 14న అర్జెంటినాలోని రోసారియోలో జన్మించినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆస్తమా వ్యాధిగ్రస్తుడైన చే లాటిన్‌ అమెరికా దేశాల విముక్తి కోసం పోరాటం చేశారన్నారు. 'చే అంటే బొమ్మకాదు. ప్రపంచంలో ఎవరికైనా, ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందించడానికి సిద్ధంగా ఉండు అని ఒక స్ఫూర్తిని యువతలో రగిలించిన నిప్పురవ్వ, పోరాటయోధుడు, సాహస వీరుడు, చైతన్య రథ సారధి, ఆకలి లేని ప్రపంచం కోసం పరితపించే ఒక విప్లవ కెరటం' అని గుర్తించాలని గనిశెట్టి కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పిట్ల మాణిక్యం, సిఐటియు నాయకురాలు కె.ఆదిలక్ష్మి, రత్నం, నూకరత్నం, కె.లక్ష్మి, జి.లక్ష్మి, జి.సత్యవతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
చేగువేరాకు డివైఎఫ్‌ఐ నివాళి
విశాఖ కలెక్టరేట్‌ : డివైఎఫ్‌ఐ కంచరపాలెం కమిటీ ఆధ్వర్యాన సోమవారం చేగువేరా వర్థంతిని నిర్వహించారు. బిఎన్‌ఆర్‌ భవన్‌లో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయ మాట్లాడుతూ, దక్షిణ అమెరికాలోని క్యూబాలో నియంత పాలనను వ్యతిరేకిస్తూ చేగువేరా విప్లవబాట పట్టారని, ఫిడేల్‌ కాస్ట్రో నిర్వహించిన ఉద్యమంలో యువతను తన ప్రసంగాలతో ఉరకలెత్తించారని తెలిపారు. ఉద్యమం తర్వాత ఫిడేల్‌ కాస్ట్రో ప్రభుత్వంలో మంత్రిగా, సెంట్రల్‌ బ్యాంక్‌ లీడర్‌గా చేగువేరా పనిచేశారని గుర్తుచేశారు. బొలీవియాలో పేదలకు న్యాయం జరగట్లేదని భావించిన ఆయన కాస్ట్రోని వీడి మళ్లీ విప్లవం వైపే అడుగులు వేశారన్నారు. మంత్రిగా మంచి హోదాలో ఉన్నప్పటికీ ఇతర దేశాల్లో పేద ప్రజల ఇబ్బందులను దూరం చేయటానికి సర్వం త్యాగం చేసిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కమిటీ సభ్యులు శరత్‌ మాట్లాడుతూ, నేడు దేశంలో రాజకీయాలు నియంతృత్వాన్ని తలపిస్తున్నాయన్నారు. యువత ఏకమై చేగువేరా స్ఫూర్తితో ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌, అప్పలరాజు, రామారావు, సావిత్రి, యువతీ యువకులు పాల్గొన్నారు.