ప్రజాశక్తి-పుట్లూరు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఉమాగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలో సిఐటియు కార్యాలయంలో ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాడేసిన కార్మికుల సొమ్మును తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలన్నారు. తాడిపత్రిలో ఉన్న లేబర్ కార్యాలయంలో ఐదు మండలాలకు సంబంధించి కార్మికుల క్లైములు 2019 నుంచి పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక కొరతను నియంత్రించి సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఎపి బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ కార్మిక సంఘంలో కొనసాగితూనే ఉన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శేఖర్, రైతుసంఘం నాయకులు చౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సూరి, భవన నిర్మాణ కార్మిక సంఘం తాడిపత్రి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, రాజు, ఉపాధ్యక్షులు సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు










