
ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని వేంపాడు రెవెన్యూ పరిధిలో అమలాపురం గ్రామానికి చెందిన శ్రీ కనకమహాలక్ష్మి సాగర మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన భూములకు పరిహారం చెల్లించే వరకు భూములు జోలికు రావద్దని మత్స్యకారులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. మండలంలోని అమలాపురంలో ఆదివారం సంఘానికి సంబంధించిన మత్స్య కారులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ, శ్రీ కనకమహాలక్ష్మి సాగర మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన సర్వే నెంబర్ 410/4, 417,418 లలో 43.15 ఎకరాల భూమిని వైజాగ్ - చెన్నై ఇండిస్టియల్ కారిడార్కు పరిశ్రమల స్థాపన కోసం అధికారులు సేకరించడం జరిగిందన్నారు.ఏపీఐఐసీ అధికారులు సేకరించిన జిరాయితీ భూములకు రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లించారో అదేవిధంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి కూడా పరిహారం చెల్లించాలని, మత్స్యకారులకు ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు.పరిహారం, ప్యాకేజీ చెల్లించే వరకు భూముల జోలికి రావద్దని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.