Jul 07,2022 22:40

గృహ నిర్మాణాల లబ్దిదారుల డేటా సేకరించాలి
భూహక్కులను కల్పించాలి
సిసిఎల్‌ఏ కార్యదర్శి సాయిప్రసాద్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా 2వేల గ్రామాలలో రీసర్వే ద్వారా లబ్ధిదారులకు భూహక్కులను పంపిణీ చేయాలని భావించిందని అందుకు తగిన విధంగా క్రమపద్ధతిలో ఏర్పాట్లు చేయాలని సిసిఎల్‌ఏ కార్యదర్శి సాయిప్రసాద్‌ అన్నారు. గురువారం రాజధాని నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా జిల్లాకలెక్టర్‌లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సుమారు 30లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, గృహనిర్మాణాలు చేసుకొంటున్నారని వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడానికి ఈనెల 11 నుంచి 18 వరకు వాలంటీర్ల సహాయంతో విచారణ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రీసర్వే పనులు నిర్ణయించుకున్న తేదీల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ మాట్లాడుతూ కొన్ని గ్రామాలు 4000 ఎకరాలకు పైబడి ఉన్నాయని రీసర్వే కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలన్నారు. రానున్న కాలంలో డ్రోన్‌ సర్వే మరింత వేగవంతంగా నిర్వహిస్తామని 1ఏ, 1బి, 1సి, 1డిలు క్రమపద్ధతి ప్రకారం పూర్తిచేస్తామని అన్నారు. నిర్ణీత సమయంలో 13 నోటిఫికేషన్‌ ఇవ్వడంతో పాటు ఆర్‌ఓఆర్‌ సిద్ధంగా ఉంచుతామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఏడీ సర్వే గిరిధర్‌రెడ్డి, సర్వేఇన్స్పెక్టర్‌ లత, ఎస్‌డిసి పర్వీన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.