
12,826 ఎకరాల్లో వరిసాగు
38,478 మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
వ్యవసాయ అధికారి ఉషారాణి
ప్రజాశక్తి - భీమడోలు
మండలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇ-క్రాప్ పంట నమోదు ఆధారంగా 12,826 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ అధికారి ఉషారాణి తెలిపారు. పంటకోత ప్రయోగాల ఫలితాలు ఆధారంగా ఒక ఎకరానికి 40 బస్తాలు (మూడు టన్నులు) వంతున 38,478 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ఇప్పటివరకు మండల పరిధిలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకించిన 14 రైతు భరోసా కేంద్రాల ద్వారా 933 ఎకరాల నుంచి వచ్చిన 479 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు తెలిపారు. గతంతో పోల్చుకుంటే ధాన్యం సేకరణ విషయమై నిబంధనలు రైతులకు అనుకూలంగా మారాయని తెలిపారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రం, అక్కడ కస్టోడియన్ అధికారిగా వ్యవహరించే గ్రామ రెవెన్యూ అధికారికి కేటాయించిన ప్రత్యేక యాప్ ద్వారా తేమ శాతం నిర్ధారణ జరుగుతుందన్నారు. దీనివల్ల తేమశాతం ఖరారు కోసం రైతులు, మిల్లర్ల అనుమతుల కోసం గతంలో మాదిరిగా ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇక నూతన విధానంలో భాగంగా రవాణా వాహనాలకు జిపిఎస్ పరికరాల అమరిక జరిగిందన్నారు. దీని ఆధారంగా మిల్లుల వద్ద ధాన్యం తరలింపులో జాప్యం తొలగిపోవడం, ధాన్యం తరలింపుపై ఇబ్బందులు ఉండవన్నారు. భీమడోలులోని రైతు భరోసా కేంద్రాల అవసరమైన రవాణా వాహనాలను పౌరసరఫరాల సంస్థ సమకూర్చుతుందన్నారు. దీనికి అదనంగా రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం తరలింపునకు ఆసక్తి గల 90 వరకు ట్రాక్టర్లు, లారీలు తమ వివరాలను నమోదు చేసుకుని ధాన్యాన్ని రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటికి జిపిఎస్ పరికరాల అమరిక జరిగిందన్నారు. ఇదే క్రమంలో ధాన్యం సేకరణకు పది లక్షల గోనె సంచెలు అవసరమవుతాయని అంచనా కట్టామన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు సరిపడా రెండు లక్షల గోనె సంచులు సిద్ధం చేసినట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి, రెండో వారాల నాటికి ధాన్యం సేకరణ పూర్తవుతుందన్న ఆశాభవాన్ని వ్యవసాయ అధికారి వెలిబుచ్చారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
ఇ-క్రాప్ నమోదు ఆధారంగా మండలంలో వరి సాగు చేసే విస్తీర్ణం తగ్గినట్లు గుర్తించామన్నారు. గతంలో 13,286 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగగా ప్రస్తుతం ఆ విస్తీర్ణం 12,826 ఎకరాలకు తగ్గిందన్నారు. సదరు విస్తీర్ణంలో చేపల చెరువులు ఏర్పడటం, ఇతర పంటలు సాగు చేయడం ప్రధాన కారణంగా తెలిపారు. దీని ఆధారంగానే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ప్రస్తుతం స్వర్ణ రకం వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా జరుగుతుందని, రానున్న కాలంలో ఆలస్యంగా కోతకు వచ్చే పిఎల్ 1100 రకం ధాన్యం సేకరణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.