ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గిరిప్రసాద్ కాలనీ వద్ద కంపచెట్లలో పేకాటతోపాటు కోడిపందేలు ఆడుతున్న వారిపై దాడి చేసి 35 మంది జూదరులను అరెస్టు చేసినట్లు సిఐ నాగార్జునరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని గిరిప్రసాద్ కాలనీ వద్ద కంపచెట్లలో అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు భారీగా జూదం, కోడి పందేలు ఆడుతుండేవారు. ఈనేపథ్యంలో అనంతపురం రూరల్ ఎస్డిపిఒ వెంకట శివారెడ్డి ఆదేశాల మేరకు పక్కాగా అందిన సమాచారంతో సిబ్బంది కలిసి వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 35 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.1,51,990తోపాటు మూడు కోడి పందేలు, రెండు కోడి కత్తులు, 35 మొబైల్ ఫోన్లు, 15 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు.
పోలీసుల అదుపులో ఉన్న జూదరులు










