Oct 23,2023 00:06

భారీ లోడుతో రోడ్డు మధ్యలో ఆగిపోయిన బొగ్గులారీ

-సామర్ధ్యం మించి అధికలోడుతో ప్రయాణం
కనీస నిబంధనలు పాటించని డ్రైవర్లు
-భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
కాలుష్యంతో అనునిత్యం తప్పని ఇబ్బందులు.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టని అధికారులు
ప్రజాశక్తి - పరవాడ
: పరవాడ మండలం కేంద్రంగా రేసుగుర్రాల్లా దూసుకుపోతోన్న బొగ్గు లారీలతో ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు బెంబేలెత్తి హడలిపోతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, అతివేగంగా వెళుతున్న లారీల నుంచి వెలువడే కాలుష్యంతో ఈప్రాంతమంతా బొగ్గుమయంగా మారడం ఒకటైతే, వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదని స్థానికులు వాపోతున్నారు.
ప్రధానంగా లంకెలపాలెం నుంచి పరవాడ మీదుగా హిందూజా, ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు బొగ్గును సరఫరా చేసే లారీల దూకుడు నిత్యం ప్రజలకు హైరానాకు గురిచేస్తోంది. కొత్తవలస నుంచి డంపర్‌ లారీల ద్వారా ఒక రోజుకు సుమారు 15 వందలకు పైగానే లారీలు తరలిస్తున్నారు. లారీలను డ్రైవర్లు రేసుగుర్రాల మాదిరిగా నడుపుతున్నారు. ప్రధానంగా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్‌ నుండి హిందూజా ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు, అలాగే అచ్చుతాపురం పరిసర ప్రాంతాల్లోకి ట్రిప్పుల లెక్కన నడుస్తుండటంతో ఈ బొగ్గు లారీలు నడిపే డ్రైవర్లు వేగానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. రెండురోజుల క్రితం పరవాడలో గొర్రెల మందపై శరవేగంగా లారీ దూసుకెళ్లిన ఘటనలో 32 గొర్రెలు మృత్యువాత పడగా, అనేక జీవాలు గాయాలపాలయ్యాయి.ఇలాంటి ఘటనలు ఈ మార్గంలో షరామామూలేనని, అయినా అధికారులు, నేతలెవరికీ పట్టడం లేదని పరవాడ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లంకెలపాలెం జంక్షన్‌ నుంచి ఊటగెడ్డ జంక్షన్‌ వరకు వెళ్లే ప్రధానరహదారి మూల మలుపు ప్రమాదాలకు నెలవుగా మారితోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పైన పరదాలు లేకుండా వెళుతున్న బొగ్గు లారీల ద్వారా కింద పడే బొగ్గు పెళ్లల పైనుంచి భారీ లోడులతో లారీలు వెళ్లడంతో ఆ బొగ్గుకాసాత బూడదగా మారి విపరీతమైన దుమ్ము ధూళితో ఈ మార్గమంతా కాలుష్య కారకంగా మారుతోంది. కాలుష్యంతో పాటు ఈ రోడ్డంతా సన్నని బొగ్గు చూరతో నిండటంతో ద్విచక్రవాహనాలు స్కిడ్‌ అయి జారిపడుతున్నాయి. ఈ ప్రాంతాలను శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులను నియమించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. లారీలపై సరైన విధానంలో టార్పాలిన్లు కట్టడం లేదు. సామర్ధ్యం మించి అధిక లోడుతో బొగ్గు లారీల యథేచ్ఛగా సాగుతూ, ప్రయాణికులు, వాహనదారులతోపాటు స్థానిక ప్రజలు ఇబ్బందులుపడుతున్నా, వీటిని పర్యవేక్షించి, నియంత్రించాల్సిన రవాణా, ఆర్‌అండ్‌బి, పోలీస్‌ యంత్రాంగం కనీసం కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందడంతో నిబంధనలు అతిక్రమించినా, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు బొగ్గు కాలుష్యంపై నానా యాగీ చేసిన వైసిపి నేతలు, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా దీనిపై కనీసం దృష్టి సారించలేదనే విమర్శలూ ఉన్నాయి. బొగ్గు లారీల వలన ప్రధానంగా రోడ్లు ధ్వంసం అవ్వడం, విపరీతంగా కాలుష్యం, రోడ్లపై బొగ్గు వెదజల్లే విధంగా సామర్ధ్యానికి మించి ప్రయాణం చేయడం, ప్రమాదాలు ఇక్కడ సర్వసాదారణంగా మారిపోయాయి. అయినా ప్రజల కష్టాలు ఎవరికీ పట్టకపోవడం దారుణమని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులతోపాటు సంబంధిత శాఖల అధికారులు స్పందించి, బొగ్గులారీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యంతోపాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు వేడుకుంటున్నారు.