Oct 07,2023 00:32

తోటల తొలగింపును అడ్డుకొని నిరసన తెలుపుతున్న రైతులు, నిర్వాసిత నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
మండలంలోని వేట జంగాల పాలెం గ్రామంలో బలవంతపు ల్యాండ్‌ పూలింగ్‌పై బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విఎంఆర్‌డిఎ అధికారులు జీడి మామిడి తోటలను తొలిగించడాన్ని శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. ట్రాక్టర్‌, జెసిబిల ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం అనకాపల్లి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం వద్ద వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు, ల్యాండ్‌ పూలింగ్‌ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట శ్రీరామ్‌, దళిత బహుజన శ్రామిక యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ కొల్లి సత్యారావు మాట్లాడుతూ ల్యాండ్‌ పూలింగ్‌లో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినా రెవెన్యూ సిబ్బంది బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు. హైకోర్టు ఆదేశాలతో గతంలో వేట జంగాల పాలెం గ్రామంలో 40 మంది రైతుల భూముల జోలికి నాటి అధికారులు వెళ్లలేదని, అయితే నాలుగేళ్ల తరువాత ఇప్పుడు విఎంఆర్‌డిఎ అధికారులు బలవంతంగా భూముల్లోకి వెళ్లి జీడి మామిడి తోటలను తొలగించడం దుర్మార్గమన్నారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ ల్యాండ్‌ పూలింగ్‌కు పాల్పడటం దారుణమన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 6116 ఎకరాలు భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించగా 4400 ఎకరాల భూమికి మాత్రమే అంగీకారం తెలిపారని, మిగతా భూములు తీసుకోమని అధికారులే హైకోర్టు తెలియజేశారని గుర్తు చేశారు. కోర్టుకు తెలియజేసిన దానికి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజాన గోవింద, బొడ్డు కాసులు, బండి రాము, భీముని నూకరాజు, కె.కోండబాబు, కె.శ్రీనువాసరావు, జి.ఈశ్వరరావు, బండి దుర్గాలమ్మ, బోరమ్మ, అచ్చయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కుంచంగిలో ల్యాండ్‌ పూలింగ్‌ రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.