Oct 29,2023 00:55

అమరావతి మేజర్‌ కాల్వలో నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు

సత్తెనపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా నాగార్జున సాగర్‌ కుడి కాల్వకింద 11 లక్షల ఎకరాల్లో పంట భూములు బీడు భూములు గా మారాయని టిడిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు అన్నారు. సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్డులో వున్న ఎండిన అమరావతి మేజర్‌ కాల్వలో టిడిపి నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిపారుదల మంత్రి కాస్త నీటిపారుదల గురించి ఆలో చించా లంటూ అంబటి రాంబాబుపై విమర్శలు చేశారు. సాగర్‌ కాల్వలు చుక్క నీరు లేక పిచ్చి మొక్కలతో నిండిపోయాయని, పొలాలు మొత్తం ఎండిపోతున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు ముందు చూపుతోహరిచంద్రపురం నుంచి నకిరేకల్‌ వరకు చేసిన ఎత్తిపోతల పథకం వైసిపి ప్రభుత్వం అనాలోచితమైన చర్య తో ఆపడం వల్ల నేడు దాదాపుగా కుడికాలువ కింద 11 లక్షల ఎకరాలు బీడు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును, లోకేశ్‌ను, పవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించడం ఆపి రైతుల కష్టాలను చూసి సాగర కుడికాలువకు నీరు ఇచ్చే పనిలో ఉండాలని చెప్పారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ ని ఎడారిగా మార్చిన ఘనత, అప్పుల ఊబిలో దించిన ఘనత వైసీపి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంబాల వెంకటేశ్వర రావు,పట్టణ కమిటీ కార్యదర్శి నూర్‌ బాషా జానీబాబు, ఉపాధ్యక్షులు శిఖా కొండలరావు,ఆదం సాహెబ్‌, మండల రైతు విభాగం అధ్యక్షుడు బండారుపల్లి నరసింహారావు, పట్టణ రైతు విభాగం అధ్యక్షులు పీలా సాంబశివరావు, ఉపాద్యక్షుడు ఆళ్ల సీతారామయ్య, ఆరేపల్లి పెదబాబు,కలుమూరి సుబ్బారావు, పరిమి నాగేశ్వరరావు,పాల్గొన్నారు.