
ప్రజాశక్తి- కె.కోటపాడు
బాల్యవాహాలను అరికట్టాలని చోడవరం 9వ అడిషనల్ జిల్లా జడ్జి కె.రత్న కుమార్ అన్నారు. మండలంలోని కెకె. అగ్రహారం గ్రామంలో శనివారం న్యాయ సలహాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను గ్రామస్థాయిలోని అరికట్టాలన్నారు. బాల్యవాహాలు జరిగినట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్యవివాహాలు జరుపుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలన్నారు. ఆ విధంగా చేస్తే ఏ ఒక్కరు బాల్య వివాహాలు చేయుటకు ప్రయత్నం చేయరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసితో పాటు సంవత్సరంలో మూడు లక్షల ఆదాయం సంపాదించేవారు ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. కేకే అగ్రహారం గ్రామంలో ఎటువంటి వివాదాలు గాని, కోర్టు కేసులు కాని లేవని ఆ గ్రామస్తులను అభినందించారు. ఇంకొక రెండు నెలలు ఎటువంటి పోలీస్ కేసులు కానీ. కోర్టు కేసులు గాని లేకపోతే ఆ గ్రామాన్ని శాంతియుత గ్రామంగా ప్రకటిస్తామన్నారు. అనకాపల్లి ఆర్డీవో చిన్ని కృష్ణ మాట్లాడుతూ ఆ గ్రామంలో ఇప్పటివరకు 292 మంది రైతులకు భూమి పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలో మూడో విడతలో రీ సర్వే వేగవంతంగా జరుగుతుందన్నారు. రీ సర్వే వల్ల రైతులకు సంపూర్ణ భూ హక్కు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జి స్వర్ణ, సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ, న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, ఎంపీడీవో కాండ్రేగుల శశిదేవి, డిప్యూటీ తహశీల్దార్ రమేష్ బాబు, స్థానిక ఎస్సై ధనుంజరు, గ్రామస్తులు పాల్గొన్నారు.