ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేసేంత వరకూ పోరాటాలు ఉధృతం చేస్తామని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు హెచ్చరించారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ కర్తవ్యాల అమలులో భాగంగా మంగళవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాటే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, 101 పద్దు కింద అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలను చెల్లించాలని, రాయదుర్గం పట్టణ జనాభా అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆమోదించిన కర్తవ్యాలను రాయదుర్గం మున్సిపాలిటీలో కూడా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఆదినారాయణ, స్థానిక యూనియన్ నాయకులు రాము, మల్లేష్, తిప్పేస్వామి, వన్నూరుస్వామి, ఎర్రిస్వామి, సిద్ధ, ఆదిలక్ష్మి సాహీరాబి, వెంకటేశులు, కార్మికులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు










