Sep 07,2022 22:57

అత్యాధునిక డ్రైవింగ్‌ టెస్టింగ్‌ కేంద్రంగా చిత్తూరు
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ రాజాబాబు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

చిత్తూరులో అత్యంత ఆధునిక డ్రైవింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇదే తరహాలో మిగతా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇదే తరహాలో వాహనాలకు సంబంధించి ఎఫ్‌సి కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ పి.రాజాబాబు అన్నారు. బుధవారం రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ చిత్తూరులో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తున్న డ్రైవింగ్‌ ట్రాక్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా వాహనదారులు ఏవిధంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పొందడానికి ట్రాక్‌ మీద వెళ్లడం జరుగుతుందో, ఎటువంటి పొరపాట్లు చేస్తే వారికి డ్రైవింగ్‌ టెస్ట్‌ ఫెయిల్‌ అవుతారనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆధునికరించిన డ్రైవింగ్‌ ట్రాక్‌ను పరిశీలించారు. అదేవిధంగా జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్‌ వాహన ఫిట్నెస్‌ కేంద్రంను చిత్తూరులో మొదట ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని భావించామని అందుకోసం స్థలాన్ని పరిశీలించడం జరుగుతోందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రవాణాశాఖ కార్యాలయం డిటిసి బసిరెడ్డి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడుతోందన్నారు. రెవెన్యూ లోను జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆధునిక ఆటోమేటిక్‌ ఫిట్నెస్‌ సెంటర్‌ను చిత్తూరులోని మొదట ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ సెంటర్‌కు అన్ని హంగులు చిత్తూరుకు ఉన్నాయని రోడ్డు ప్రమాదాల నివారణ ఈ సెంటర్‌ ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ బసిరెడ్డి, ఇతర ఎంవిఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.