ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపి ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈమేరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 18న నగరంలోని డిఎంహెచ్ఒ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన గోడపత్రికలను శుక్రవారం నారాయణపురంలోని రేడియంట్ ఫంక్షన్ హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశావర్కర్లకు పనిభారం తగ్గించాలని, సంబంధం లేని పనులు చేయించవద్దని, ప్రభుత్వ సెలవులుచ, మెడికల్ లీవులు ఇవ్వాలని, సచివాలయాల్లో ఉదయం 9 నుంచి 4గంటల వరకూ కూర్చోబెట్టడం ఆపాలని, పిహెచ్సిల్లో స్వీపింగ్ పని చేయించడం ఆపాలని, డిమాండ్ చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న నగరంలోని డిఎంహెచ్ఒ కార్యాలయం ముందు చేపట్టనున్న ధర్నాలో భారీగా ఆశావర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి, ఉపాధ్యక్షురాలు మాలతి, నగర నాయకులు నీరజ, అనురాధ, సమంత, సిఐటియు జిల్లా నాయకులు గోపాల్, రామాంజనేయులు, ముర్తుజ, వెంకటనారాయణ, ఎజి.రాజమోహన్, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న ఎపి ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఆశావర్కర్లు










